విధాత : ఉత్తమ భారతీయ హిందీ భాషా చిత్రాలకు అందించే ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ -2025 కార్యక్రమం శనివారం గుజరాత్ వేదికగా జరుగబోతుంది. అహ్మదాబాద్ కాంకరియా సరస్సు సమీపంలో ఉన్నఈకేఏ అరీనా స్టేడియంలో 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అట్టహాసంగా ప్రారంభం కాబోతున్నాయి. టైమ్స్ గ్రూప్ ద్వారా నిర్వహించబడే వేడుకను ఏ ఏడాది హ్యూందాయ్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ గా పంపిణీ చేయబోతున్నారు. హ్యుందాయ్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కార్యక్రమం కోసం ఇప్పటికే నటినటులు గుజరాత్ చేరుకుంటున్నారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, కరణ్ జోహార్, మనీష్ పాల్లు 70వ అవార్డు వేడుకను హోస్ట్ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ హీరో, హీరోయిన్స్ అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, అనన్య పాండే, కృతి నసన్, సిద్దాంత్ చతుర్వేదిలు తమ స్పెషల్ పెర్ఫార్మన్స్తో ఆకట్టుకోనున్నారు.
ఇక ఈ 70వ ఫిల్మ్ఫేర్ లో విజేతలు ఎవరనేది మరికొన్ని గంటల్లో తెలియనుంది. గత ఏడాది 2024కు గాను.. లాపాతా లేడీస్ రికార్డు స్థాయిలో 24 నామినేషన్లతో ముందుంది. ఇది ఒక సంవత్సరంలో ఒకే చిత్రానికి వచ్చిన అత్యధిక నామినేషన్లు రావడం విశేషంగా నిలిచింది.