Operation Kagar | ఆపరేషన్ కగార్లో మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. గురువారం జరిగిన ఎన్కౌంటర్లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు వెంకట నరసింహాచలం అలియాస్ గౌతమ్ అలియాస్ సోమన్న మృత్యువాతపడిన విషయం తెలిసిందే. తాజాగా మరో నాయకున్ని ఆ పార్టీ కోల్పోయింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు ఆడేళ్ళు అలియాస్ భాస్కర్ మృతి చెందారు. గురువారం జరిగిన ఎన్కౌంటర్ ప్రాంతానికి సమీపంలోనే ఈ ఘటన కూడా చోటు చేసుకున్నట్టు తెలుస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన భాస్కర్ సుదీర్ఘకాలం నుంచి మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నారు. ఆయన కోసం తెలంగాణ, ఛత్తీస్గఢ్ పోలీసులు పలుమార్లు కూంబింగ్ నిర్వహించారు. పలు ఎన్కౌంటర్ల నుంచి త్రుటిలో ఆయన తప్పించుకున్నారు. తాజాగా శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయారు. భాస్కర్ మృతితో ఆదిలాబాద్ జిల్లాలో విషాదం అలుముకుంది. భాస్కర్ పై రూ. 25 లక్షల రివార్డు కూడా ఉంది.