Kerala:
విధాత : మళయాల చిత్ర పరిశ్రమలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. డ్రగ్స్ తీసుకుంటున్నారనే ఆరోపణలతో ఇప్పటికే నటుడు షైన్ టామ్ చాకో అరెస్టైన విషయం తెలిసిందే. తాజాగా ఇదే పరిశ్రమకు చెందిన మరో ఇద్దరు దర్శకులను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. దర్శకులు ఖలీద్ రెహమాన్, అష్రఫ్ హంజాతోపాటు వారి స్నేహితుడు షలీఫ్ను కొచ్చిన్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దర్శకుల అపార్ట్మెంట్లో శనివారం అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు. కొద్ది మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేశారు.
మలయాళంలో ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ‘జింఖానా’ చిత్రానికి దర్శకత్వం వహించింది ఖలీద్ రెహమాన్. ‘తమాషా’ చిత్రానికి అష్రఫ్ హంజా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
కాగా డ్రగ్స్ కేసులో మళయాల దర్శకుల అరెస్టుపై అధికారులు స్పందించారు. షైన్ టామ్, దర్శకులు ఖలీద్ రెహమాన్, అష్రఫ్ హంజాలు ఒకే అపార్ట్ మెంట్ లో ఉంటున్నారని..ఆ ముగ్గురు వ్యక్తులు కొన్నేళ్ల నుంచి గంజాయి తీసుకుంటున్నారని ప్రాథమిక విచారణలో తేలిందని వెల్లడించారు. మత్తుపదార్థాలను వారికి ఎవరు సప్లై చేస్తున్నారనే విషయంపైనా విచారణ చేస్తున్నామని అధికారులు చెప్పారు.