Site icon vidhaatha

IND vs SL | తొలి టి20 మ్యాచ్​లో కొత్త కెప్టెన్​ విజయం

భారత్​, శ్రీలంకల మధ్య మొదలైన టి20 సిరీస్​ (IND vs SL T20I Series) మొదటి మ్యాచ్​లో భారత్​ విజయభేరి మోగించింది. టాస్​ ఓడిపోయి బ్యాటింగ్​కు దిగిన భారత్​కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభానిచ్చారు. యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal)​(21 బంతుల్లో 2 సిక్సర్లు, 5 ఫోర్లతో 40 పరుగులు), శుభమన్​ గిల్ Shubman Gill​(16 బంతుల్లో 34 పరుగులు, ఒక సిక్స్​, 6 ఫోర్లు ) పవర్​ప్లే ముగిసేసరికి 74 పరుగులు జోడించి, సరిగ్గా అక్కడే గిల్​ వికెట్​ పారేసుకున్నాడు. 74/0 కాస్తా 74/1 అయింది. ఆ వెంటనే మరో ఓపెనర్​ జైస్వాల్​ పెవిలియన్​ చేరాడు. క్రీజ్​లో ఇద్దరు కొత్త బ్యాటర్లు, కెప్టన్​ సూర్యకుమార్​ యాదవ్(New Captain Surya Kumar Yadav)​, రిషభ్​ పంత్​ ఉండటంతో శ్రీలంక మరో వికెట్​ కోసం ప్రయత్నించింది కానీ, కెప్టెన్​ దూకుడు ముందు వాళ్ల మంత్రాలు పారలేదు. సూర్య తాను కెప్టెన్​ అయినా ఆటతీరులో ఏ మాత్రం  మార్పు ఉండదని చెప్పినట్లే చేసాడు. శ్రీలంక బౌలర్లను చీల్చిచెండాడాడు. మరోవైపు పంత్​ సూర్యకే ఎక్కువగా స్ట్రైయికింగ్​ ఇస్తూ నెమ్మదిగా స్కోరును పెంచినా, సూర్య దెబ్బకు రన్​రేట్​ ఏమాత్రం తగ్గకుండా పరుగులెత్తింది. ఇద్దరూ మూడో వికెట్​కు 76 పరుగులు జోడించాక, సూర్య అవుటయ్యాడు (76/3). కెప్టెన్​గా తొలిమ్యాచ్​లోనే తన రెండో వేగవంతమైన అర్ధశతకం(26 బంతుల్లో 58 పరుగులు: 2 సిక్స్​లు, 8 ఫోర్లు) బాది తానేమీ తగ్గేదే లే అని నిరూపించాడు. ఆ తర్వాత పంత్​(33 బంతుల్లో 49 పరుగులు: ఒక సిక్స్​, 6 ఫోర్లు) వేగం పెంచి స్కోరుబోర్డును ఉరకలెత్తించే బాధ్యత తీసుకున్నాడు. కానీ, రెండో ఎండ్​లో వికెట్లు రాలుతునే ఉన్నాయి. రింకూ, పాండ్యా, పరాగ్​ సింగిల్​ డిజిట్​కే పరిమితమయ్యారు. ఇక  క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన భారత్​ చివరికి నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 213(213/7 in 20 Overs) పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో స్టార్​ బౌలర్​ పతిరణ(Pathirana) 4 వికెట్లతో నిప్పులు కురిపించగా, మధుశంక, తీక్షణ, హసరంగ తలా ఒకో వికెట్​ తీసుకున్నారు.

214 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంక బ్యాటర్లు ఆదినుంచే చెలరేగిపోయారు. అచ్చు భారత్​లానే ఆడుతూ, వికెట్​ ఇవ్వకుండా రన్​రేట్​ తగ్గకుండా భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ఓపెనర్లు నిశాంక(Nissanka), మెండిస్​లు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. ముఖ్యంగా నిశాంక చిచ్చరపిడుగులా చెలరేగి 48 బంతుల్లో 4 సిక్స్​లు, 7 ఫోర్లతో 79 పరుగులు చేసాడు. 45 పరుగులు చేసిన మెండిస్(Kushal Mendis)​ చివరికి జట్టు 84 పరుగుల వద్ద అక్షర్​ పటేల్​ బంతికి క్లీన్​ బౌల్డ్​ అయ్యాడు. ఆ తర్వాత 140 పరుగుల వద్ద నిశాంక పెవిలియన్​ చేరగా, 140/2 (14.1 ఓవర్లు) తో మ్యాచ్​ పూర్తిగా శ్రీలంక చేతుల్లోనే ఉన్నట్లు కనిపించింది. కానీ, లక్ష్యం పెద్దది కావడంతో వేగంగా పరుగులు రాబట్టే క్రమంలో శ్రీలంక బ్యాటర్లు ఒక్కొక్కరుగా పెవిలియన్​ చేరారు. చివరికి 19.2 ఓవర్లకు శ్రీలంక 170 పరుగులకు ఆలౌట్​ అయి ఓటమి చవిచూసింది. శ్రీలంక రెండు వికెట్లకు 140 పరుగులు చేసి, ఆఖరి 8 వికెట్లను కేవలం 30 పరుగులకే చేజార్చుకుంది.

భారత బౌలర్లలో  రియాన్​ పరాగ్(Riyan Parag) 3 వికెట్లతో చెలరేగగా, అర్షదీప్​, అక్షర్​, ​ తలా రెండు వికెట్లు, సిరాజ్​, రవి బిష్ణోయ్​ చెరో వికెట్​ తీసుకున్నారు.

 

Exit mobile version