విధాత: ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదని.. ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్ అని సీఎం రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటుకై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీ సంఘాలతో కలిసి ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ధ ధర్నా నిర్వహించించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చాలా ప్రమాదముందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని..ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు… ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్ అని అభివర్ణించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కాదు.. అనుముల ఇంటెలిజెన్స్ తో రాష్ట్రానికి ప్రమాదం ఉందన్నారు. అనుముల ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తోందని ఆరోపించారు. అనుముల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్పా రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనిపించడం లేదని విమర్శించారు. ప్రజలను మోసం చేయడమే అనుముల ఇంటెలిజెన్స్ అని, అనుముల ఇంటెలిజెన్స్ ను వాడి కులగణనను తప్పదోవ పట్టించి బీసీలకు అన్యాయం చేస్తున్నారని కవిత ఆరోపించారు. అసెంబ్లీలో పెట్టకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించి అధ్యయనం చేసిన తర్వాత రిజర్వేషన్ ఇస్తారంటార అని ఎద్దేవా చేశారు.
కులగణన వివరాలను వెల్లడించాలి
బీఆర్ఎస్ ప్రభుత్వంలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలు వెబ్ సైట్ లో పెట్టామని, తెలంగాణలో చేసిన కులగణన వివరాలను వెల్లడించలేదని కవిత గుర్తు చేశారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి కులగణన వివరాలను వెల్లడించేందుకు ఎందుకు ధైర్యం లేదని ప్రశ్నించారు. 2011లో యూపీఏ హయాంలో దేశంలో కులగణన చేసినా ఇప్పటికీ వివరాలు వెల్లడించలేదన్నారు. బీసీ కులగణన చేయబోమని బీజేపీ స్పష్టం చేసింది కాబట్టి ఆ పార్టీపై బీసీలు ఒత్తిడి చేయాలని సూచించారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో మేము కూడా కలిసి వస్తామన్నారు. కానీ కాంగ్రెస్ లాగా ఢిల్లీలో దొంగ దీక్షలు చేయబోమన్నారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి నిరవధికంగా దీక్షలు కూర్చుందామని కవిత తెలిపారు.
బీసీ రిజర్వేషన్ బిల్లులు ఏమయ్యాయి
చట్టసభలు బిల్లులు ఆమోదించి నాలుగు వారాలైందని, ప్రస్తుతం ఆ బిల్లుల స్థితి ఏమిటో ప్రభుత్వం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. గవర్నర్ వద్దనే పెండింగ్ లో ఉన్నాయా… లేదా రాష్ట్రపతికి పంపించారా ? అని ప్రశ్నించారు. బిల్లులు ఆమోదం పొందిన తర్వాత అన్ని పార్టీలను ప్రధాని వద్దకు తీసుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, కానీ ఇప్పటి వరకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లలేదన్నారు. బీజేపీతో సీఎం రేవంత్ రెడ్డికి లాలూచి లేకుంటే ప్రధాని అపాయింట్ మెంట్ లభించేదని వ్యాఖ్యానించారు. బీజేపీని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లడం లేదని, దానికి బదులు ఢిల్లీలో తుఫేల్ ధర్నా చేశారని కవిత ఎద్దేవా చేశారు. ధర్నాకు రాహుల్ గాంధీ వస్తారని ఊదరగొట్టారు కానీ చివరికి ఆయన రాలేదన్నారు. ఢిల్లీలో కూడా ముఖ్యమంత్రి తెలుగులో మాట్లాడారని, ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తేవాలంటే వాళ్లకు అర్థమయ్యే భాషలో మాటల్లో మాట్లాడాల్సిన అవసరముందన్నారున. కులగణన అధ్యయనం పూర్తి చేసే వరకు మనం మాట్లాడవద్దని స్వతంత్ర అధ్యయన సంస్థ హెచ్చరిక చెబుతోందని, మీరెవరు మాకు హెచ్చరిక చేయడానికని కవిత మండిపడ్డారు.
ఏప్రిల్ 11లోగా పూలే విగ్రహం ఏర్పాటుపై ప్రకటన చేయాలి
చిత్తశద్ధి ఉంటే కులగణన నివేదికను అసెంబ్లీలో పెట్టండని ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. రిజర్వేషన్ల పెంపునకు మూడు వేర్వేరు బిల్లులు పెట్టాలని డిమాండ్ చేసి సాధించామని, ఇది తెలంగాణ జాగృతి, యూపీఎఫ్, బీఆర్ఎస్ పార్టీ విజయమని కవిత చెప్పుకొచ్చారు. ఏప్రిల్ 11లోగా అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం ప్రకటన చేయాలని కవిత డిమాండ్ చేశారు. దేశంలో తరతరాలుగా వెనుకబడ్డ జాతులకు న్యాయం జరగాలని కాంక్షించిన వ్యక్తి పూలే అని, పూలే తనకు గురువు అని అంబేద్కర్ చెప్పారని గుర్తు చేశారు. మహిళల కోసం పాఠశాలలను ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి పూలే అని, కులవివక్షకు వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాటం చేశారని, అసెంబ్లీలో పూలే విగ్రహం పెడితే సమాజం స్పూర్తి పొందుతుందన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పూలే విగ్రహం కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.