యాదాద్రి ప‌వ‌ర్ ప్లాంటు జాప్యానికి కారకులెవరు?

యాదాద్రి ప‌వ‌ర్ ప్లాంట్ నిర్మాణంలో ఇంత జాప్యానికి కార‌కులు ఎవ‌ర‌ని డిప్యూటీ సీఎం మల్లు భ‌ట్టి విక్ర‌మార్క అధికారుల‌ను ప్ర‌శ్నించారు

  • Publish Date - January 12, 2024 / 10:37 AM IST
  • యాదాద్రి ప‌వ‌ర్ ప్లాంటు అంచనాలు రూపొందించింది ఎవ‌రు?
  • బీహెచ్ఈఎల్ చేసిన ఎస్టిమేష‌న్ ఏమిటి?
  • 2020 నాటికి ఎందుకు పూర్తి చేయ‌లేదు?
  • యాదాద్రిపై స‌మీక్ష‌లో అధికారుల‌ను ప్ర‌శ్నించిన డిప్యూటీ సీఎం భ‌ట్టి

విధాత‌, హైద‌రాబాద్‌: యాదాద్రి ప‌వ‌ర్ ప్లాంట్ నిర్మాణంలో ఇంత జాప్యానికి కార‌కులు ఎవ‌ర‌ని డిప్యూటీ సీఎం మల్లు భ‌ట్టి విక్ర‌మార్క అధికారుల‌ను ప్ర‌శ్నించారు. గురువారం స‌చివాల‌యంలో ఇంధ‌న శాఖ కార్య‌ద‌ర్శి రిజ్వితో క‌లిసి బీహెచ్ఈఎల్ అధికారుల‌తో యాదాద్రి ప‌వ‌ర్ ప్లాంట్‌పై స‌మీక్షించారు. అగ్రిమెంట్ ప్ర‌కారం 2020 అక్టోబ‌ర్ నాటికి రెండు ప్లాంట్లు, 2021 అక్టోబ‌ర్ నాటికి మ‌రో మూడు ప్లాంట్లు పూర్తి చేసుకొని మొత్తం నాలుగువేల మెగావాట్ల విద్యుత్తు ఉత్ప‌త్తి చేయాల్సిన ప్రాజెక్టు ఇప్ప‌టివ‌ర‌కు అలాగే పెండింగ్‌లో ఉండ‌టానికి గ‌ల కారణాలేమిట‌ని అడిగారు. ఓపెన్ టెండ‌ర్ పిలువ‌కుండా నామినేష‌న్ పద్ధతిలో బీహెచ్ఈఎల్‌కు ఎందుకు ఎలా ఇచ్చార‌ని అడిగారు. వీట‌న్నింటిపై నివేదిక ఇవ్వాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.


2021నాటికే మొదలవ్వాలి కదా!

యాదాద్రి ప‌వ‌ర్ ప్లాంటు నిర్మాణానికి రూ.34,500 కోట్ల అంచనాల‌తో 2015 జూన్ ఆర‌వ తేదీన అగ్రిమెంట్, 2017 అక్టోబ‌ర్‌లో వ‌ర్క్ ఆర్డ‌ర్ అయింది. ప‌నులు అగ్రిమెంట్ ప్ర‌కారం జ‌రిగితే 2021 నాటికి మొత్తం ప్రాజెక్ట్ ఉత్ప‌త్తి ప్రారంభించాల‌ని, కానీ దీనికి భిన్నంగా ఇక్క‌డ ఎందుకు ఉంద‌ని అధికారుల‌ను భట్టి విక్రమార్క ప్ర‌శ్నించారు. బీహెచ్ఈఎల్ అధికారులు ఆల‌స్యానికి గ‌ల కారణాలు వివ‌రిస్తూ స‌కాలంలో త‌మ‌కు డ‌బ్బులు చెల్లించ‌లేద‌న్నారు. అలాగే ఎన్జీటీ అనుమ‌తులు కూడా రాలేద‌ని తెలిపారు. దీంతో రూ.34,500 కోట్ల ప్రాజెక్ట్‌లో బీహెచ్‌ఈఎల్‌ వ‌ర్క్ ఎన్ని కోట్ల‌కు ఉందని ప్రశ్నించగా.. రూ.20,444 కోట్ల ప‌నులు చేప‌ట్టినట్టు అధికారులు తెలిపారు. మిగ‌తా ప‌నులు జెన్‌కోతో పాటు ఇతర సంస్థ‌లు చేప‌ట్టాయ‌న్నారు.


త‌మ‌కు ఇచ్చిన ప‌నుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు రూ.15,860 కోట్ల ప‌నులు చేశామ‌ని, దీనికి ఇప్ప‌టి వ‌ర‌కు రూ.14,400 కోట్ల చెల్లింపులు చేశార‌న్నారు. ఇంకా రూ.1167 కోట్ల బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయ‌ని వివ‌రించారు. అయితే గ‌త ప్ర‌భుత్వం చెల్లింపులు విడ‌త‌లవారీగా చేయ‌లేద‌ని, 2023 మార్చి ఒక్క నెల‌లోనే 91 శాతం పేమెంట్ చేశార‌ని తెలిపారు. నిధులు స‌కాలంలో చెల్లించ‌క‌పోవ‌డంతో తాము స‌బ్ కాంట్రాక్ట‌ర్ల‌కు చెల్లింపులు చేయ‌లేక పోయామ‌ని, దీంతో ప‌నులు స‌జావుగా జ‌ర‌గ‌లేద‌ని మంత్రికి అధికారులు వివ‌రించారు.

పర్యావరణ అనుమతులు తెస్తే సెప్టెంబర్‌ 24 నాటికి రెండు యూనిట్లు

ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు, ఎన్జీటీ అనుమ‌తులు ఏప్రిల్ 24 నాటికి తీసుకు వ‌స్తే తాము సెప్టెంబ‌ర్ 24 వ‌ర‌కు రెండు యూనిట్లు పూర్తి చేసి విద్యుత్తు ఉత్పత్తి చేపడుతామని బీహెచ్‌ఈఎల్‌ అధికారులు తెలిపారు. అదే విధంగా డిసెంబ‌ర్‌ 24 వ‌ర‌కు మ‌రో రెండు యూనిట్లు, 24 మే నాటికి మిగిలిన ఒక్క యూనిట్‌ను అందుబాటులోకి తెస్తామని డిప్యూటీ సీఎంకు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా వివరించారు.