Metro Trains : హైదరాబాద్లో మెట్రో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బుధవారం ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో రోడ్లపై భారీగా వరదనీరు చేరింది. పలు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాంతో రోడ్డు మార్గం కంటే మెట్రోలో అయితే త్వరగా గమ్యం చేరవచ్చని భావించిన ప్రయాణికులు భారీ సంఖ్యలో మెట్రో స్టేషన్లకు చేరారు.
దాంతో రద్దీ విపరీతంగా పెరిగింది. మెట్రో నిర్వాహకులు రద్దీగా తగ్గట్టుగా రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచారు. ఐదు నిమిషాలకు ఒక రైలుకు బదులుగా రెండు నిమిషాలకు ఒక రైలును నడిపారు. అయితే మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో ఎర్రమంజిల్ దగ్గర సాంకేతిక లోపం కారణంగా ఓ రైలు నిలిచిపోయింది. దాంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
అప్పటికే బయలుదేరిన రైళ్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైళ్ల లోపల ఊపిరాడక కొందరు ఎమర్జెన్సీ డోర్లు తెరుచుకుని బయటికి వచ్చారు. ఆ తర్వాత రైలులో సమస్యను చక్కదిద్దడంతో రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. ఇంతలో ఎల్బీనగర్మెట్రో స్టేషన్లో ఎగ్జిట్ మిషన్లు మొరాయించాయి. దాంతో ప్రయాణికులు బయటకు వెళ్లే మార్గం లేక సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.