Jain Inscription Found In Nalgonda | నల్లగొండలో వెలుగు చూసిన జైన శాసనం

నల్లగొండ అమ్మగూడెం గుట్టపై ‘జినబ్రహ్మయోగి పాద చారుకీర్తి’ జైన శాసనం వెలుగు చూసింది, తెలంగాణ చరిత్రలో అరుదైన గుర్తింపు.

jain-inscription-found-in-nallagonda-districts-anneshwaramma-gutta

విధాత : నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని అమ్మగూడెం రెవెన్యూ పరిధిలో ఉన్న అన్నేశ్వరమ్మ గుట్టమీద జైన శాసనం వెలుగు చూసింది. కొత్త తెలంగాణ చరిత్రబృందం పరిశోధక సభ్యులు రాగి మురళి, చిక్కుల యాదగిరిలు గుట్టపైన చెక్కివున్న జినబ్రహ్మజోగి శాసనం గుర్తించారు. ‘జినపాదాల’కు మూడువైపుల చుట్టు తెలుగన్నడం లిపిలో, కన్నడ భాషలో ‘జినబ్రహ్మయోగి పాద చారుకీర్తి’ అనే లఘు శాసనం చెక్కివుంది. గతంలో లభించిన ఇటువంటి శాసనాలలో కేవలం ‘జినబ్రహ్మజోగి’ అని మాత్రమే వుంది. చరిత్రబృందం ‘జినబ్రహ్మయోగి పాద చారుకీర్తి’ అని ఉన్న శాసనాన్ని తొలిసారి గుర్తించింది.

జైనమతం ప్రకారం ప్రస్తుత అవసర్పిణి యుగంలో ధర్మనాథుడు జైన తీర్థంకరులలో 15వవాడు. అన్ని కర్మలనుంచి విముక్తుడైన సిద్ధుడు ధర్మనాథుడు. శిఖర్జీలో మోక్షం పొందాడు. హేమచంద్రుడు సంస్కృతంలో రాసిన జైనమత గ్రంథం ‘త్రిషష్టి శలాక పురుష చరిత్ర’లో ధర్మనాథుడు పేర్కొనబడ్డాడు. జైనసన్యాసి జినసేనాచార్యుడు ‘మహాపురాణం’లో ధర్మనాథ తీర్థంకరుని ‘జినబ్రహ్మజోగి’ (జైనబ్రహ్మయోగి)గా పేర్కొన్నాడు.

జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పాతగూడూరు బయట ఒక రాతిగుండుమీద అరుదైన జైనతీర్థంకరుడు ధర్మనాథుని శిల్పం చెక్కివుంది. తలపై త్రిస్తరఛత్రం వుంది. అతనికి కుడిపక్కన తీర్థంకరుని లాంఛనం వజ్రం చెక్కివుంది. రాతి గుండుమీద పాదాలు వున్నాయి. పాదాల ముందు 12వ శతాబ్దపు తెలుగన్నడలిపిలో జినబ్రహ్మ అని చెక్కిన లేబుల్(నామ) శాసనముంది. హన్మకొండ జిల్లా కాజీపేటలోని మడికొండ, మెట్టుగుట్ట మీద జైనమతబసది ఆనవాళ్ళు కనిపించాయి. మెట్టుగుట్ట మీద ‘జినబ్రహ్మజోగి’ లఘుశాసనం, ధర్మనాథుని ప్రతిమ, పాదాలు వెలుగు చూసాయి. తాజగా అన్నీశ్వరమ్మగుట్ట శాసనం తెలంగాణాలో మూడవ జైన శాసనంగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు.