విధాత, వరంగల్ ప్రతినిధి: కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న గొడవలు అవినీతి డబ్బులను పంచుకోవడంలో వారి మధ్య జరిగిన గొడవే తప్పా.. మరి ఇంకా ఏం లేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. అవినీతి ఆస్తికి పంచాయతీకి సంబంధించినవేనని కడియం ఆరోపించారు. తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడానికి ప్రధాన కారణం కేసీఆర్ బిడ్డ లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయినందుకేనని షాకింగ్ కామెంట్స్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కవిత లిక్కర్ కేసులో విచారణను ఎదుర్కోవడం అనేక రోజులు జైల్లో ఉండటం సరైన పద్ధతి కాదని తాను బయటకు వచ్చానని అన్నారు . పదేళ్ల అధికారంలో కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులను దోచుకుందని విమర్శించారు. ధరణిని అడ్డుపెట్టుకొని వేల ఎకరాల భూములు కబ్జా చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుపెట్టుకొని కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయలు సంపాదించిందని ఆక్షేపించారు. వేల ఎకరాల భూములు, వేలకోట్ల రూపాయలు పంచుకునే క్రమంలో కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని కడియం చెప్పుకొచ్చారు. కేసీఆర్ కుటుంబ గొడవలతో తెలంగాణ ప్రజలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.
Kadiyam Srihari : కవిత లిక్కర్ కేసు తర్వాతే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చా
