Medaram Jatara : అడవి ఉప్పొంగిన వేళ అమ్మ దేవతల దర్శనం

అడవి ఉప్పొంగిన వేళ అమ్మల దర్శనం! మేడారంలో పతాకస్థాయికి చేరిన భక్తుల పారవశ్యం. గద్దెలపై కొలువుదీరిన వనదేవతలు.. భారీగా విఐపిల తాకిడితో సామాన్యులకు తప్పని ఇబ్బందులు!

Medaram Jatara

విధాత, ప్రత్యేక ప్రతినిధి: నిండు పున్నమి వెలుగుల్లో అమ్మ దేవతలతా గద్దెలపై కొలువు తీరడంతో గురువారం అర్ధరాత్రి నుంచి అడవి ఉప్పొంగుతోంది. అలలు అలలుగా అనంత కెరటాలుగా ఎగిసిపడుతూ జనసంద్రంగా మారిన మేడారం భక్తి పారవశ్యంలో మునిగితేలుతోంది. శుక్రవారం మేడారంలో సన్నివేశాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఘనకీర్తి పొందిన వనదేవతలు సమ్మక్క, సాలలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై భక్తులకు దర్శనం ఇవ్వడంతో మొక్కలు సమర్పించు భక్తులు పోటెత్తారు. వరంగల్ నుంచి మేడారం వరకు వచ్చే జన ప్రవాహం తో దారులన్నీ కిక్కిరిసిపోయాయి. మేడారం చుట్టూ దుర్గమారణ్య పరిసరాలు జనంతో నిండుకుండలాగా దర్శనమిస్తున్నాయి. క్యూలైన్ లు, గద్దెల ప్రాంగణంలో ఇసుకవేస్తేరాలనంత జనం మొక్కులు సమర్పించుకునేందుకు వేచిచూస్తున్నారు. అనాదిగా మేడారం సమ్మక్క భక్తులుగా కొనసాగుతున్నవారు నాలుగురోజులు ఇక్కడే ఉండి నలుగురు గద్దెలపైకి చేరిన తర్వాత శుక్రవారం వనదేవతలకు మొక్కులు చెల్లించుకోవడం ఆచారంగా వస్తోంది. ఇదిలాఉండగా శుక్రవారం విఐపిలూ, వివిఐపీల తాకిడితో సామాన్య భక్తులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. జాతర సందర్భంగా పాసుల జారీకి నీతులు చెప్పిన మంత్రులు మాత్రం ఆచలించడంలో విఫలమయ్యారు. అవసరమైన వారికి జాతరలో విధులునిర్వహిస్తున్న వారికి పాసులు ఇవ్వడానికి అనేక అభ్యంతరాలు చెప్పిన నేతలు రాజకీయ వర్గాలకు, పలుకుబడి ఉన్నవారికి ఇష్టారాజ్యంగా ఇచ్చారు. జాతరకు భారీగా జనం రావడంతో ఆర్టీసీబస్సులు కూడా నిండుగా వెళుతున్నాయి. జనం రద్దీని నియంత్రించేందుకు పోలీసులు, జిల్లా యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Medaram Jatara : మేడారం జాతరలో  ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న (జోగిని) హిజ్రాలు
Niagara Falls | వింటర్ వండర్ ల్యాండ్.. గడ్డకట్టిన నయాగరా అందాలు.. వీడియో చూశారా..?

Latest News