మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో రిమాండ్ రిపోర్ట్ సంచలనం

మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్ట్ సంచలన విషయాలను బయటపెట్టింది. పోలీసుల రాకతో కాల్పులు, సిమ్లా నుంచి కొకైన్ తెచ్చిన వివరాలు, ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన అంశాలు ఈ కేసులో వెలుగులోకి వచ్చాయి.

Former MLA Pilot Rohit Reddy and MP Putta Mahesh Kumar linked to the Moinabad farmhouse drug party case

మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో పేర్లు వెలుగులోకి వచ్చిన పైలట్ రోహిత్ రెడ్డి, ఎంపీ పుట్టా మహేష్ కుమార్

Moinabad Farmhouse Drug Case: Remand Report Reveals Shocking Details

హైలైట్స్​:

విధాత క్రైం బ్యూరో | మార్చి 16, 2026 | హైదరాబాద్​:

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో జరిగిన ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్ట్ సంచలన వివరాలను బయటపెట్టింది. డ్రగ్స్ వినియోగం, మద్యం పార్టీ, తుపాకీ కాల్పులు, సిమ్లా నుంచి కొకైన్ తెచ్చిన అంశాలు ఈ కేసులో బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నిర్వహించిన వీకెండ్ పార్టీగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

పోలీసుల రాకతో కాల్పులు.. రివాల్వర్ స్వాధీనం

మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో స్వాధీనం చేసుకున్న జర్మన్ తయారీ .32 రివాల్వర్ మరియు కొకైన్

పోలీసుల రిమాండ్ రిపోర్ట్ ప్రకారం ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందని సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఫామ్‌హౌస్‌లోకి ప్రవేశించిన వెంటనే తుపాకీ కాల్పుల శబ్ధాలు వినిపించాయని తెలిపారు. వెంటనే పోలీసులు “మేము పోలీసులం.. కాల్పులు ఆపండి” అని హెచ్చరించినప్పటికీ మరో రెండు సార్లు కాల్పులు జరిగినట్లు పేర్కొన్నారు. అదే సమయంలో ఫామ్‌హౌస్ లోపల నుంచి “మీరు కాల్చేయండి.. ఏం జరిగినా బాధ్యత నాదే” అని ఎవరో గట్టిగా అన్నట్లు పోలీసులు రిపోర్ట్‌లో పేర్కొన్నారు. పోలీసులు గట్టిగా హెచ్చరించడంతో కాల్పులు ఆగిపోయాయని తెలిపారు.

ALSO READ: క్రైమ్ హౌస్.. మొయినా బాద్ ఫామ్ హౌస్ !

పోలీసులు స్విమ్మింగ్ పూల్ వద్దకు చేరుకుని తనిఖీలు ప్రారంభించారు. ఫామ్‌హౌస్‌లోకి వెళ్లిన వెంటనే సెర్చ్ వారెంట్‌ను పైలట్ రోహిత్ రెడ్డికి అందజేశారు. తనిఖీల సమయంలో బాత్రూం దగ్గర నమిత్ శర్మ చేతిలో ఉన్న తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి బుల్లెట్ షెల్స్ పట్టుకుని ఉండగా అతనిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనలో ఒక మహిళతో పాటు మొత్తం 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తనిఖీల సమయంలో జర్మనీ తయారీ .32 కాలిబర్ రివాల్వర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తుపాకీ పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డిదిగా గుర్తించారు.

మొదట బుకాయించినా.. చివరకు ఒప్పుకోలు

హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ అనంతరం పోలీసులు నిర్వహించిన తనిఖీలు

ఫామ్‌హౌస్‌లో పట్టుబడ్డ వారిని పోలీసులు విడివిడిగా విచారించారు. మొదట ఎవరూ డ్రగ్స్ తీసుకోలేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు పదేపదే ప్రశ్నించడంతో సిల్వర్ శరత్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి రెండు గ్రాముల కొకైన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపై పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్‌ను పోలీసులు ప్రశ్నించారు. ఆ విచారణలో డ్రగ్స్ కొనుగోలు చేసిన విషయం బయటపడింది.

సిమ్లా నుంచి తెచ్చిన కొకైన్.. గ్రాముకి రూ.15,000

విచారణలో కౌశిక్ రవి కొకైన్ తానే తెచ్చినట్లు ఒప్పుకున్నాడు. సిమ్లాకు వ్యాపార నిమిత్తం వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ఫామ్‌హౌస్‌లో జరిగే డ్రగ్స్ పార్టీ కోసం కొకైన్ తీసుకొచ్చినట్లు చెప్పాడు.

ఒక్క గ్రాము కొకైన్‌ను రూ.15,000కు కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడించాడు. పార్టీ సమయంలో కొకైన్‌ను మద్యంలో కూడా కలిపి తాగినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

డ్రగ్ టెస్టుల్లో ఆరుగురికి పాజిటివ్

హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ అనంతరం పోలీసులు నిర్వహించిన తనిఖీలు

ఫామ్‌హౌస్‌లో ఉన్న 11 మందికి పోలీసులు డ్రగ్ డిటెక్షన్ కిట్ ద్వారా టెస్టులు నిర్వహించారు. అందులో పుట్టా మహేశ్​ రెడ్డి, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ, పైలట్ రోహిత్ రెడ్డి లకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు.

మరింత నిర్ధారణ కోసం వారిని ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి రక్త నమూనాలు సేకరించారు. రెండోసారి నిర్వహించిన రక్త పరీక్షల్లో ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌కూ డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు రిపోర్ట్ వెల్లడించింది.

ALSO READ: డ్రగ్స్‌ కేసులో పైలట్‌ రోహిత్‌రెడ్డి సహా ముగ్గురికి రిమాండ్

ఈ కేసులో మొత్తం ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. నమిత్ శర్మ మూడు రకాల డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా రక్త పరీక్షల్లో బయటపడింది.

పోలీసులను చంపి తప్పించుకోవాలనుకున్నారా?

పోలీసుల విచారణలో నమిత్ శర్మ కాల్పులు ఉద్దేశపూర్వకంగానే జరిపినట్లు ఒప్పుకున్నాడు. ఫామ్‌హౌస్‌లోకి వస్తున్న పోలీసులను భయభ్రాంతులకు గురిచేయడానికి మాత్రమే కాల్పులు జరిపినట్లు తెలిపాడు. పోలీసులు గాయపడేలా కాల్పులు జరిపి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవాలని కూడా ప్లాన్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

వీకెండ్ డ్రగ్స్ పార్టీ.. రోహిత్ రెడ్డివే ఏర్పాట్లు

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో డ్రగ్స్ పార్టీ జరిగిన ఫామ్‌హౌస్

పోలీసుల సమాచారం ప్రకారం ఈ ఫామ్‌హౌస్ గెట్‌టుగెదర్ ముందుగానే ప్లాన్ చేసిన వీకెండ్ డ్రగ్స్ పార్టీగా తేలింది. పైలట్ రోహిత్ రెడ్డి ఈ పార్టీ ఏర్పాటు చేసి పలువురిని ఆహ్వానించినట్లు రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌పై కూడా పోలీసులు మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు.

Latest News