విధాత, హైదరాబాద్ : ధరణి పోర్టల్ లో గత ప్రభుత్వం పెద్దలు సాగించిన అక్రమాలు భూభారతి పోర్టల్ ఆడిట్ తో బట్టబయలు అవుతున్నాయని, అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ధరణి లొసుగులను అడ్డుపెట్టుకుని భూ రిజిస్ట్రేషన్ చలానా సొమ్ములు కాజేయడాన్ని భూ భారతి పోర్టల్ సాంకేతికత ద్వారా ఆడిట్ నిర్వహించి..అక్రమాలపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపిస్తే
9 జిల్లాల్లోని 35 మండలాల్లో అక్రమాలు బయటపడ్డాయని పొంగులేటి వెల్లడించారు. ఇందుకు కారణమైన 48 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలలో కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థతో ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ ప్రాథమిక నివేదికలో ధరణితో జరిగిన అవినీతి, అక్రమాలు వెలుగుచూశాయని పొంగులేటి తెలిపారు. ఈ నివేదికను పరిశీలించాక 31జిల్లాలలో అడిట్ నిర్వహిస్తామన్నారు
ధరణి పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి 35లక్షల లావాదేవీలు జరిగాయని, ప్రాథమికంగా 4,848 లావాదేవీల్లో అక్రమాలు జరిగాయని గుర్తించగా, విచారణ తర్వాత 1,109 డాక్యుమెంట్లకు సంబంధించి రూ.4 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన నిధులు పక్కదారి పట్టినట్టు కమిటీ వెల్లడించిందని మంత్రి తెలిపారు. భూభారతి పోర్టల్ అక్రమాల్లో ఎవరి పాత్ర ఎంత? తెర వెనుక ఎవరైనా ఉన్నా రా? రెవెన్యూ అధికారుల పాత్ర ఏమైనా ఉందా? వంటి అంశాలపై కమిటీ సభ్యులతో చర్చించామని, అక్రమాలపై మరింత లోతైన విచారణ చేసి తుది నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించినట్లుగా మంత్రి తెలిపారు. ప్రభుత్వ భూములు కొల్లగొట్టిన వారిని, రిజిస్ట్రేషన్ చలానా సొమ్ము స్వాహా చేసిన వారిని వదిలేది లేదన్నారు.
నేడు ఖమ్మం జిల్లాలో శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్స్ల అందజేత
ఇప్పటికే మొదటి విడతలో నాలుగు వేల మంది శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్స్లు జారీ చేయగా ఆదివారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లో మరో రెండు వేల మందికి లైసెన్స్లు జారీ చేయనున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఈ లైసెన్స్డ్ సర్వేయర్లతో రాష్ట్రంలో నక్షా లేని 373 గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తామని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
BRS Boycott ABN : ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్ను బహిష్కరించిన బీఆర్ఎస్
BRS Boycott ABN : ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్ను బహిష్కరించిన బీఆర్ఎస్
