TTD | తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక! ఈ నెల 17, 19వ తేదీల్లో వీఐపీ దర్శనాల ( Tirumala VIP Break Darshan )ను టీటీడీ రద్దు చేసింది. మార్చి 19న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకుంది.
ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారం కోయల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించం ఆనవాయితీ వస్తుంది. ఈ క్రమంలోనే ఈ నెల 19న ఉగాది ఆస్థానం దృష్ట్యా ఈ నెల 17వ తేదీన కోయల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. దీంతో ఆ రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. అలాగే ఈ నెల 19న ఉగాది ఆస్థానం సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా నిలిపివేసింది.
వీఐపీ బ్రేక్ దర్శనాలపై ఆంక్షలు విధించినప్పటికీ.. అధికారిక హోదాలో వచ్చే వీఐపీ ప్రొటోకాల్ దర్శనాలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని టీటీడీ తెలిపింది. కేవలం ఈ నెల 16, 18వ తేదీల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు లేదా ఇతర ప్రజాప్రతినిధుల నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి వచ్చే రికమండేషన్ లెటర్లను స్వీకరించబోమని స్పష్టం చేసింది.
లడ్డూ ప్రసాదాల తయారీకి నెయ్యి కొరత లేదు
శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన ఆవు నెయ్యి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని టీటీడీ స్పష్టం చేసింది. టీటీడీ వద్ద నెయ్యి నిల్వలు లేవని, లడ్డూ ప్రసాదాల తయారీలో అంతరాయం ఏర్పడుతుందని సోషల్మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపింది. ఇలా అసత్య ప్రచారం చేయడం సరికాదని సూచించింది. శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన ఆవు నెయ్యి సరఫరా మూడంచెల కొనుగోలు విధానం ద్వారా జరుగుతోందని తెలిపింది. ఒకే సంస్థపై ఆధారపడకుండా మూడు వేర్వేరు సంస్థల ద్వారా నెయ్యి సరఫరా జరుగుతున్నందున ఎలాంటి అనుకోని పరిస్థితులు తలెత్తినా సరఫరాలో అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
Read More:
Doomsday Fish | మెక్సికో బీచ్కు కొట్టుకొచ్చిన డూమ్స్డే చేపలు.. భారీ విపత్తు ముంచెత్తనుందా?
Chai Guy | లేఆఫ్లో ఉద్యోగం పోతే.. అమెరికాలో ఛాయ్ అమ్ముతూ సక్సెస్ అయ్యాడు!
