విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి, ప్రత్యేకంగా కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ కోసం 2024-25 ఆర్థిక సంవత్సరానికి వచ్చే కేంద్ర బడ్జెట్ సెషన్లో తగినంత బడ్జెట్ కేటాయింపులు జరిగేలా చూడాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ని కోరుతూ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో వేగవంతమైన అభివృద్ధి కోసం కేంద్ర-రాష్ట్ర సంబంధాలను మెరుగుపరచడంలో కేంద్ర ప్రభుత్వానికి తన మద్దతును అందించడానికి సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో మన రాష్ట్రానికి ఇచ్చిన హామీలు, వాగ్దానాలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వ నిబద్ధతగా వ్యవహరించాలని, రాష్ట్రానికి కేంద్రం నిధులు తీసుకురావడంలో కేంద్ర మంత్రిగా మీ పాత్ర చాలా కీలకమైందని పేర్కోన్నారు. నేను రాష్ట్ర మంత్రిగా, కరీంనగర్ బిడ్డగా, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజల ప్రయోజనాల కోసం అవసరమైన బడ్జెట్ కోసం చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఈ అభివృద్ధి పనుల గురించి మీ దృష్టికి తీసుకువస్తున్నట్లుగా తెలిపారు. వాటిల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయడం, మిడ్ మానేరు , గౌరవెల్లి ప్రాజెక్ట్ భూనిర్వాసిత భాదిత కుటుంబాలకు సూక్ష్మ ,చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపన, శాతవాహన విశ్వవిద్యాలయానికి 200 కోట్ల ఆర్థిక సహాయం అందించడం, కరీంనగర్ తిరుపతి మధ్య నడిచే బై విక్లీ ఎక్స్ ప్రెస్ రైలు ప్రతి రోజు నడిచేలా చేయడం, కరీంనగర్, షిర్డీ మధ్య రైల్వే మార్గం డబ్లింగ్ను వేగవంతం చేయడం, హుస్నాబాద్లో మెడికల్ కాలేజీ మంజూరు చేయడం, కొత్తపల్లి నుండి జనగాం జాతీయ రహదారి మంజూరు, సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్ అభివృద్ధికి నిధులు, వేములవాడ, కొండగట్టు ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరీకి కేంద్ర బడ్జెట్లో నిధులు సాధించాలని కోరారు. ఎన్ఎల్ఎం, పీఎంఈజీ, ఎన్హెచ్ఎం పథకాల కింద తగినంత బడ్జెట్ కేటాయింపులు సాధించాలని కోరారు. రాబోయే బడ్జెట్ సమావేశాలలో పైన పేర్కొన్న అభివృద్ధి పనులను కార్యరూపం దాల్చేందుకు కరీంనగర్ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించాలని కోరుతున్నట్లుగా పొన్నం తన లేఖలో పేర్కోన్నారు.
Ponnam Prabhakar Goud | కేంద్ర బడ్జెట్లో నిధులు తీసుకురా.. కేంద్ర మంత్రి బండి సంజయ్కి మంత్రి పొన్నం లేఖ
