SCR Special Trains | రేపట్నుంచి క్రిస్మస్ సెలవులు ప్రారంభం కానున్నాయి. మరో వారం రోజులకు కొత్త సంవత్సరం రానుంది. ఆ తర్వాత సంక్రాంతి పండుగ. ఇలా వరుస సెలవులు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. వైజాగ్ నుంచి చర్లపల్లి, తిరుపతి మధ్య రెండు నెలల పాటు ప్రత్యేక రైళ్లను నడపాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు జనవరి, ఫిబ్రవరి నెలల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. కాబట్టి ప్రయాణికులు ప్రత్యేక రైళ్లను సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
విశాఖపట్నం- చర్లపల్లి వీక్లీ ఎక్స్ ప్రెస్
విశాఖపట్నం – చర్లపల్లి వీక్లీ ఎక్స్ప్రెస్( 08579 ) జనవరి 2 నుంచి ఫిబ్రవరి 27వ తేదీ వరకు అందుబాటులో ఉండనుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు వైజాగ్లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లి చేరుకోనుంది. దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, కృష్ణా కెనాల్, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, పగిడిపల్లి స్టేషన్ల మీదుగా చర్లపల్లి చేరుకోనుంది.
తిరుగు ప్రయాణంలో భాగంగా ప్రతి శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు చర్లపల్లిలో బయల్దేరనుంది. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు వైజాగ్ స్టేషన్ చేరుకోనుంది. ఈ ప్రత్యేక రైలు(08580) జనవరి 3 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు అందుబాటులో ఉండనుంది.
విశాఖపట్నం – తిరుపతి వీక్లీ ఎక్స్ ప్రెస్
విశాఖపట్నం – తిరుపతి వీక్లీ ఎక్స్ప్రెస్(08583) జనవరి 5 నుంచి ఫిబ్రవరి 23 వరకు ప్రతి సోమవారం రాత్రి 7.10 గంటలకు వైజాగ్లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.15కి తిరుపతి స్టేషన్ చేరుకోనుంది. దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ , తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీ కాళహస్తి, రేణిగుంట స్టేషన్ల మీదుగా తిరుపతి చేరుకోనుంది.
తిరుగు ప్రయాణంలో భాగంగా ప్రతి మంగళవారం తిరుపతిలో రాత్రి 9.50 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు వైజాగ్ చేరుకోనుంది. ఈ ప్రత్యేక రైలు(08548) జనవరి 8 నుంచి ఫిబ్రవరి 26 వరకు అందుబాటులో ఉండనుంది.
