విధాత: సంక్రాంతి పర్వదినం సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారి కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గత సంక్రాంతి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి పండుగ రద్దీ దృష్ట్యా 6,432 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. జనవరి 9 నుంచి 15 వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు ఉండనున్నాయి.
సకల సౌకర్యాలు
ఈ సంక్రాంతికి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ నుంచి ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా టీజీఎస్ఆర్టీసీ ప్లాన్ చేస్తోంది. సంక్రాంతి సమయంలో బస్సు సర్వీసులు నిర్వహించడం టీజీఎస్ఆర్టీసీకి ఎంతో కీలకమని, ఆ మేరకు పూర్తిగా సన్నద్ధం కావాలని క్షేత్రస్థాయి అధికారులకు ఇప్పటికే టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సూచించింది. హైదరాబాద్లోని రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయనుంది.
రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం అమల్లో ఉంటుందని తెలిపింది. తమ ప్రయాణ సమయంలో మహిళలు విధిగా జీరో టికెట్లను తీసుకోవాలని గుర్తుచేసింది. ప్రైవేట్ వాహనాల్లో ప్రమాదకర ప్రయాణం చేయవద్దని ప్రజలకు సూచించింది. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం టీజీఎస్ఆర్టీసీబస్.ఇన్ వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలని సూచించింది.
ఏపీకి ప్రత్యేక సర్వీసులు
హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు కూడా ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ఇదివరకే టీజీఎస్ ఆర్టీసీ తెలిపింది. ప్రధానంగా అమలాపురం, కాకినాడ, కందుకూరు, నర్సాపురం, పోలవరం, రాజమండ్రి, రాజోలు, ఉదయగిరి, విశాఖపట్నం, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, శ్రీశైలం, తిరుపతి, తదితర ప్రాంతాలకు ఈ బస్సులు నడుస్తాయి. అలాగే, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుగు పయనమయ్యే వారి కోసం కూడా ప్రత్యేక బస్సులను సంస్థ ఏర్పాటు చేసింది.