విధాత: తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను చాటుకుంది. బుధవారం మూడో విడతలో 3,752 సర్పంచ్, 28,410వార్డులకు ఎన్నికలు జరిగాయి. వీటిలో సింహభాగం గ్రామపంచాయతీల సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుని సత్తా చాటింది. మూడో విడతలో ప్రస్తుతం వెల్లడైన ఫలితాల మేరకు 4,157 గ్రామపంచాయతీలకుగాను ఏకగ్రీవమైన 394 సర్పంచ్ స్థానాలతో కలుపుకుని కాంగ్రెస్ పార్టీ 2,286 సర్పంచ్ స్థానాలను హస్తగతం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ 1,143 సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 244కి పైగా సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది.
మూడు విడతల్లో కాంగ్రెస్ హవా
మూడు విడతల్లో కలిపి 12,727గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగగా..ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ పార్టీ 7093 సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ 3,510 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 688కు పైగా సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించింది. మిగతా సర్పంచ్ స్థానాల్లో సీపీఐ, సీపీఎం, స్వంతంత్రులు విజయం సాధించారు.
