Brahmaputra underwater tunnel| బ్రహ్మపుత్ర నది కింద రోడ్డు-రైలు హైబ్రిడ్ అండర్‌వాటర్ టన్నెల్!

దేశంలోనే తొలి రోడ్డు-రైలు హైబ్రిడ్ అండర్‌వాటర్ టన్నెల్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బ్రహ్మపుత్ర నది కిందుగా రోడ్డు-రైలు మార్గాలను కలిపే దేశపు తొలి అండర్‌వాటర్ సొరంగంను రూ.18,600 కోట్లతో నిర్మించేందుకు కేంద్ర కేబినెట్ అనుమతి లభించింది.

విధాత, హైదరాబాద్ : దేశంలోనే తొలి రోడ్డు-రైలు హైబ్రిడ్ అండర్‌వాటర్ టన్నెల్ (India first road rail hybrid tunnel) నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బ్రహ్మపుత్ర నది కిందుగా రోడ్డు-రైలు మార్గాలను కలిపే దేశపు తొలి అండర్‌వాటర్ సొరంగంను రూ.18,600 కోట్లతో నిర్మించేందుకు కేంద్ర కేబినెట్ అనుమతి లభించింది. ఈ ప్రాజెక్ట్‌ను అత్యాధునిక ట్విన్ ట్యూబ్ టన్నెల్ బోరింగ్ మెషిన్ ( twin tube tunnel TBM technolog) సాంకేతికతతో నిర్మించనున్నారు. ఇందులో ఒక ట్యూబ్ పూర్తిగా రైల్వే రవాణాకు, మరో ట్యూబ్ రహదారి ప్రయాణానికి కేటాయించనున్నారు.

ఈ సొరంగం మొత్తం పొడవు సుమారు 33.7 కిలోమీటర్లుగా ఉండనుంది. అందులో 15.79 కిలోమీటర్లు నేరుగా బ్రహ్మపుత్ర నది అడుగున నిర్మించే అండర్‌వాటర్ టన్నెల్ భాగం కావడం విశేషం. మిగిలిన భాగం ఆధునిక కట్ అండ్ కవర్ పద్ధతిలో నిర్మించనున్నారు. ఇది టెక్నాలజీ పరంగా భారత్‌లోనే ఒక మైలురాయిగా నిలవనుంది. ముఖ్యంగా నది కారణంగా ఎదురయ్యే ప్రయాణ ఆలస్యం, వాతావరణ ప్రభావాల సమస్యలను ఈ సొరంగం ద్వారా గణనీయంగా తగ్గించవచ్చని  కేంద్రం పేర్కొంటుంది.

దూరం 240కి.మీ నుంచి 34కు..సమయం 6 గంటల నుంచి అరగంట వరకు

బ్రహ్మపుత్ర నది కింద నిర్మించబోయే ఈ అండర్‌వాటర్ ట్విన్-ట్యూబ్ రోడ్డు-రైలు టన్నెల్ అస్సాంలోని గోహ్‌పూర్ ప్రాంతాన్ని నూమాలిగఢ్‌తో నేరుగా అనుసంధానం చేస్తుంది. ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణించాలంటే సుమారు 240 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఇందుకు ఆరు గంటల వరకు సమయం పడుతుంది. కొత్త టన్నెల్ పూర్తయిన తర్వాత అదే ప్రయాణం దూరం కేవలం 34 కిలోమీటర్లకు తగ్గనుంది. ప్రయాణ సమయం కూడా కేవలం 20 నుంచి 30 నిమిషాల్లో పూర్తవుతుంది.

ఈ అండర్‌వాటర్ ట్విన్-ట్యూబ్ రోడ్డు-రైలు టన్నెల్ సొరంగం భారతదేశ రవాణా మౌలిక వసతుల కల్పన రంగంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా కేంద్రం భావిస్తుంది. ఇది కేవలం ఒక సొరంగం మాత్రమే కాదు, ఉత్తర పూర్వ భారత అభివృద్ధికి దారి చూపే భవిష్యత్ ద్వారంగా.. అస్సాం రాష్ట్ర అభివృద్ధిలో గేమ్ చేంజర్ గా నిలుస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇది ప్రజలకు మాత్రమే కాకుండా వ్యాపారాలు, సరుకు రవాణాకు కూడా గణనీయమైన ప్రయోజనకారిగా..ఆ ప్రాంత అభివృద్దికి, ఆర్థిక వృద్దికి దోహదం చేస్తుందని కేంద్రం పేర్కొంది. ఈ టన్నెల్ అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంగా ఉన్నందునా..అస్సాం వంటి సరిహద్దు రాష్ట్రాలకు సైనిక బలగాలను, అత్యవసర పరిస్థితుల్లో సైన్యం, రక్షణ సామగ్రిని వేగంగా తరలించేందుకు ఉపయోగపడుతుందని కేంద్రం తెలిపింది.

Latest News