హైదరాబాద్ : ప్రముఖ గాయకుడు జయరాజ్ గుండెపోటుకు గురయ్యారు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. జయరాజ్ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరుమీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా ప్రదానం చేసే ‘కాళోజీ నారాయణరావు అవార్డు’ 2023 సంవత్సరానికిగాను గాయకుడు జయరాజ్ను వరించిన సంగతి తెలిసిందే.
మహబూబాబాద్ జిల్లాకు చెందిన జయరాజ్ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను అనుభవించి కవిగా పేరు తెచ్చుకున్నారు. పేద దళితకుటుంబానికి చెందిన జయరాజ్ వివక్షలేని సమాజం కోసం కృషి చేశారు. బుద్ధుడి బోధనల ప్రభావం ఆయనపై చాలానే ఉంది. అంబేదర్ రచనలతో స్ఫూర్తి పొందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పల్లెల్లో తిరుగుతూ తన ఆటపాటలత ద్వారా ప్రజల్లో ఉద్యమ భావజాలాన్ని రగిలించారు. ప్రకృతి గొప్పతనాన్ని వర్ణిస్తూ, పర్యావరణ పరిరక్షణ కోసం పలు పాటలు రాశారు. మనిషికీ, ప్రకృతికీ ఉన్న అవినాభావ సంబంధాన్ని తన సాహిత్యం ద్వారా సున్నితంగా విశ్లేషించారు.