Site icon vidhaatha

Arunachalam Tour | అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్దామా..? తెలంగాణ టూరిజం స్పెషల్‌ ప్యాకేజీ ప్రకటించింది మరి..!

Arunachalam Tour | తమిళనాడులోని అరుణాచలం (తిరువణ్ణామలై) క్షేత్రం పంచభూత లింగాల్లో ఒకటి. అరుణ అంటే ఎర్రని.. అచలం అంటే కొండ అని అర్థం. మనం చేసిన రుణ పాపాలను తొలగిస్తుందని పండితులు పేర్కొంటారు. శివ భక్తులు తిరువణ్ణామలైని కైలాస పర్వంగా భావిస్తుంటారు. తిరు అంటే శ్రీ, అణ్ణామలై అంటే పెద్ద కొండ అని అర్థం. దేశంలోని ప్రముఖ క్షేత్రాల్లో ఒకటి. ఈ ఆలయంలో దర్శనం కోసం దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా పౌర్ణమి సమయంలో లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. పౌర్ణమికి గిరి ప్రదక్షిణ ఎంతో ఫేమస్‌. దాంతో పౌర్ణమి చంద్రుడి వెలుగుల్లో ఇసుక వేస్తే రాలనంత జనం గిరి ప్రదక్షిణ చేసుకుంటారు.

ఈ క్షేత్రానికి పౌర్ణమికి ఏపీ, తెలంగాణ నుంచి సైతం భారీగా భక్తులు వెళ్తుంటారు. ఈ సమ్మర్‌లో గిరి ప్రదక్షిణ కోసం అరుణాచలం వెళ్లే వారి కోసం తెలంగాణ టూరిజం ప్రత్యేకంగా ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా తమిళనాడులోని ఈ అరుణాచలం క్షేత్రానికి తీసుకెళ్లనున్నది. నాలుగు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ నెల (ఏప్రిల్‌) 21న ప్యాకేజీ అందుబాటులో ఉన్నది. ‘HYDERABAD-ARUNACHALAM -Telangana Tourism టూరిజం పేరుతో ఈ ప్యాకేజీ మళ్లీ మే 20న, ఆ తర్వాత జూన్‌ 19న అందుబాటులో ఉంటుంది. ప్యాకేజీలో పెద్దలకు రూ.7500, పిల్లలకు రూ.6వేలు ధర నిర్ణయించారు. తొలిరోజు సాయంత్రం 6.30 గంటలకు బషీర్‌బాగ్‌ నుంచి బస్సు బయలుదేరుతుంది. తెల్లవారి ఉదయం కాణిపాకం చేరుకుంటారు.

9గంటల వరకు దర్శనాలు పూర్తి చేసుకుంటారు. ఆ తర్వాత తిరువణ్ణామలైకి బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 3 గంటలకు అరుణాచలం చేరుకుంటారు. ఆ తర్వాత గిరిప్రదక్షిణ, దర్శనాలు పూర్తి చేసుకుంటారు. మూడోరోజు బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత వేలూరుకు బయలుదేరి వెళ్తారు. శ్రీపురం గోల్డెన్‌ టెంపులో దర్శనాలుంటాయి. సాయంత్రం 4 గంటలకు మళ్లీ హైదరాబాద్‌కు ప్రయాణం మొదలవుతుంది. నాలుగో రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోవడంతో ప్యాకేజీ పర్యటన ముగుస్తుంది. వివరాల కోసం 9848540371 నంబర్‌లో, లేదంటే.. info@tstdc.in మెయిల్ ద్వారా సంప్రదించాలని తెలంగాణ టూరిజం కోరింది.

Exit mobile version