South Korea | సరదా కోసం ఏఐ ఇమేజ్ పోస్టు.. జైలులో పెట్టిన దక్షిణ కొరియా పోలీసులు!

ఏఐతో తోడేలు ఇమేజ్ క్రియేట్ చేసి ఓ వ్యక్తి అడ్డంగా బుక్కయ్యాడు. నకిలీ ఫొటోతో గందరగోళానికి గురిచేశాడని అతడిని అరెస్టు చేశారు. దక్షిణ కొరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

South Korea | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఫేక్ ఫొటోలు, వీడియోలు ఎక్కువైపోయాయి. కొంతమంది ఏఐని మంచి పనులకు వాడుతుంటే.. మరికొందరు మాత్రం సోషల్ మీడియాలో పాపులర్ కావడం కోసం తమ పైత్యం మొత్తం చూపిస్తున్నారు. ఇలాగే దక్షిణ కొరియాలో ఏఐతో తోడేలు ఇమేజ్ క్రియేట్ చేసి సోషల్‌మీడియాలో పోస్టు చేసి గందరగోళం సృష్టించాడు. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.

వివరాల్లోకి వెళ్తే.. ఏప్రిల్ 8వ తేదీన డేజాన్ సిటీలోని ఓ జూ నుంచి రెండేళ్ల తోడేలు తప్పించుకుని బయటకు వచ్చింది. దీంతో ఆ తోడేలు కోసం జూ అధికారులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. జూకు దగ్గర ఉన్న స్కూళ్లను కూడా మూసివేయించారు. ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావద్దని ఆ ప్రాంతంలో హెచ్చరికలు జారీ చేశారు. అలాంటి సమయంలో నగరంలోని రోడ్లపై తోడేలు తిరుగుతున్నట్లుగా సోషల్‌‌మీడియాలో ఒక ఫొటో వైరల్‌గా మారింది. అది చూసిన సిబ్బంది వెంటనే గాలింపు ప్రాంతాన్ని మార్చి, ఆ ప్రాంతానికి బృందాలను పంపించారు. డేజాన్ నగరంలోని ప్రధాన కూడలి వద్ద తోడేలు కనిపించిందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అత్యవసర హెచ్చరికలు కూడా జారీ చేశారు.

తర్వాత అక్కడి సీసీ టీవీ ఫుటేజ్‌ల్లో తోడేలు కనిపించకపోవడంతో.. అనుమానం వచ్చి దర్యాప్తు చేయగా అది ఏఐ ఇమేజ్ అని తెలిసింది. దీంతో ఆ ఇమేజ్ పోస్టు చేసిన వ్యక్తిని 40 ఏళ్ల వ్యక్తిగా గుర్తించి అరెస్టు చేశారు. ఏఐ ఇమేజ్‌పై విచారించగా.. సరాదా కోసమే ఆ ఇమేజ్‌ను క్రియేట్ చేసినట్లు చెప్పడం గమనార్హం.

ప్రస్తుతం అతనిపై విచారణ కొనసాగుతుంది. అతను చేసిన నేరానికి గరిష్ఠంగా ఐదేళ్ల జైలుశిక్షల లేదా సుమారు 10 మిలియన్ కొరియన్ వోన్ (సుమారు రూ.6లక్షలు) జరిమానా విధించే అవకాశం ఉంది. కాగా, తప్పిపోయిన తోడేలును 9 రోజుల తర్వాత ఎక్స్‌ప్రెస్‌ వే సమీపంలో సురక్షితంగా పట్టుకున్నారు.

Read More:

Viral News | విదేశీ కలల వెనుక చెల్లించే అసలు మూల్యం ఇదే.. భారతీయ యువతి భావోద్వేగ పోస్టు

 

Latest News