Viral News | చదువు పూర్తికాగానే విదేశాలకు వెళ్లి సెటిల్ అవ్వాలని చాలామంది కలలు కంటారు. అక్కడ ఖర్చులు ఎక్కువే అయినప్పటికీ అదే స్థాయిలో ఆదాయం ఉంటుంది కాబట్టి తొందరగా నాలుగు రాళ్లు వెనుకేసుకోవచ్చని ఆశపడతారు. కానీ ఆ సంపాదన కోసం మనం చెల్లించే మూల్యం మాత్రం వెలకట్టలేనిదని చెబుతూ ఓ భారతీయ యువతి భావోద్వేగానికి గురైంది. విదేశాల్లో ఉండటం వల్ల తాను కోల్పోతున్న ముఖ్యమైన క్షణాల గురించి చెబుతూ ఆమె చేసిన వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది.
యూరప్ దేశమైన డబ్లిన్లో నివసిస్తున్న భారతీయ యువతి ప్రాచీ దుసాద్ ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను పోస్టు చేసింది. అందులో విదేశాల్లో ఉండటం కోసం అద్దె బిల్లులు, కిరాణ ఖర్చులు అధికంగా భరించాల్సి వస్తుందని అంటుంటారని.. కానీ ముఖ్యమైన క్షణాల్లో కుటుంబానికి దూరంగా ఉండటమే మనం చెల్లించే అసలైన మూల్యమని భావోద్వేగంగా వెల్లడించింది.
ప్రస్తుతం భారత్లో తన కజిన్ వివాహ వేడుక జరగుతుందని తెలిపింది. తమది పెద్ద మార్వాడీ కుటుంబమని.. తన కుటుంబసభ్యులంతా కలిసి నృత్యాలు చేస్తూ, పాటలు పాడుతూ ఆనందగా వేడుకలో పాల్గొంటున్నారని చెప్పింది. కానీ తాను మాత్రం డబ్లిన్లో ఒంటరిగా ఉండాల్సి వచ్చిందని బాధపడింది. వివాహ వేడుకకు సంబంధించిన తమ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం ఫొటోలు, వీడియోలు వస్తున్నాయని.. వాటిని పదే పదే చూస్తుండటం వల్ల మరింతగా ఫ్యామిలీని మిస్ అవుతున్నానని చెప్పింది. ప్రతి క్షణం తాను ఇండియాలో ఉంటే బాగుండు అని అనిపిస్తోందని వెల్లడించింది.
డబ్బు సమస్య వల్ల తాను డబ్లిన్లో ఉండాల్సి రాలేదని, విమాన టికెట్ కొనగలిగే సామర్థ్యం ఉందని ప్రాచి స్పష్టం చేసింది. అయితే అక్కడ తనకు ఉన్న బాధ్యతలు, లైఫ్స్టైల్ కారణంగా ఇండియాకు వెళ్లడం సాధ్యం కావడం లేదని బాధపడింది. విదేశావల్లో ఉంటే మనం చెల్లించాల్సిన అసలు మూల్యం ఇదే అని భావోద్వేగానికి గురైంది.
ఇన్స్ట్రాగ్రామ్లో ప్రాచీ పోస్టుకు పెట్టి క్యాప్షన్లో ప్రతి నిర్ణయానికి లాభనష్టాలు ఉంటాయని తెలిపింది. కొద్దిరోజులు ఎదుగుదల, స్వతంత్ర జీవితం, కొత్త అవకాశాలు ఆనందాన్ని ఇస్తాయని, మరికొన్ని రోజులు ఇంటి జ్ఞాపకాలు, కుటుంబాన్ని మిస్సవుతున్న భావన వెంటాడుతుందని చెప్పింది. అలా అని మనం తప్పుడు నిర్ణయం తీసుకున్నామని కాదు.. అది సాధారణంగా మన మనసుకు అనిపించే భావోద్వేగమని తెలిపింది.
