మరో స్కైలాబ్‌? భూమిపై పడిపోనున్న స్పేస్‌ టెలిస్కోప్‌.. మళ్లించేందుకు నాసా వినూత్న ప్రయోగం

అంతరిక్షంలో 22 ఏళ్లుగా సేవలందిస్తున్న టెలిస్కోప్‌కు తీవ్ర ముప్పు ఎదురవుతున్నది. అది ఈ ఏడాది జూన్‌ లేదా సంవత్సరాంతంలో కూలిపోయే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్న శాస్త్రవేత్తలు.. వినూత్న ఆలోచనతో ఆ ముప్పును తప్పించబోతున్నారు.

మరో స్కైలాబ్‌? భూమిపై పడిపోనున్న స్పేస్‌ టెలిస్కోప్‌.. మళ్లించేందుకు నాసా వినూత్న ప్రయోగం

స్కైలాబ్ తరహా ప్రమాదం మళ్లీ పొంచి ఉందా? అంతరిక్షంలో విధి నిర్వహణలో ఉన్న స్పేస్‌ టెలిస్కోప్‌ ఒకటి కట్టు తప్పి.. భూమిపైకి జారి పోతున్నదనే వార్తలు ఒక్కసారిగా స్కైలాబ్‌ కూలిన నాటి పరిస్థితులను జ్ఞప్తికి తెస్తున్నాయి. భూమిపై పడిపోతున్న స్పేస్‌ టెలిస్కోప్‌ను మరో స్థిరమైన కక్ష్యలోకి మళ్లించేందుకు నాసా శాస్త్రవేత్తలు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు.

స్కైలాబ్‌ కూలిపోయే సమయంలో ప్రపంచంలో చోటు చేసుకున్న గందరగోళం అంతా ఇంతా కాదు.. ఇక యుగాంతమేనన్న వదంతులు చెలరేగి.. జనం వణికిపోయారు. భారతదేశంలోనైతే ఊళ్లలో జనం బయటకు వచ్చేవారు కాదు.. దాని దిశ మార్చడానికి నాసా అప్పట్లో ప్రయత్నించినా.. తగిన సాంకేతికత లేకపోయింది. ఎట్టకేలకు స్కైలాబ్‌ శకలాలు హిందూ మహాసముద్రంలో, పశ్చిమ ఆస్ట్రేలియాలో పడ్డాయి. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు అదే తరహాలో స్పేస్‌ టెలిస్కోప్‌ ఒకటి భూమిపై పడిపోబోతున్నది. స్కైలాబ్‌ కూలిపోయిన సమయంలో సాంకేతిక పరిజ్ఞానం చాలా పరిమితం. కానీ.. ఇప్పుడు అధునాతన సదుపాయాలు అభివృద్ధి చెందాయి. ఈ నేపథ్యంలో.. పడిపోతున్న స్పేస్‌ టెలిస్కోప్‌ దారి మళ్లించేందుకు దానిపైకి స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగించేందుకు నాసా ఏర్పాట్లు చేస్తున్నది. అయితే.. ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను భూమిపై నుంచి కాకుండా.. పెగాసస్‌ ఎక్స్‌ఎల్‌ రాకెట్‌ ద్వారా అంతరిక్షంలోకి తీసుకెళ్లి అక్కడి నుంచి ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

స్సేస్‌ టెలిస్కోప్‌ భూమిపై పడకుండా నిరోధించడమే ఈ ఆపరేషన్‌ టార్గెట్‌. ఈ ఏడాది జూన్‌ నెలలో టెలిస్కోప్‌ కూలిపోనున్న నేపథ్యంలో ఈ ప్రమాదాన్ని నివారించేందుకు నాసా దగ్గర రెండు నెల వ్యవధి మాత్రమే ఉన్నది. ఈ నేపథ్యంలోనే అంతరిక్షం నుంచే దాన్ని దారి మళ్లించేందుకు ఈ ప్లాన్‌ను నాసా ఎంచుకున్నది.

నీల్ గెహ్రెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ అనే ఈ స్పేస్‌ టెలిస్కోప్‌ను 2004 నవంబర్‌ 20వ తేదీన అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి 22 ఏళ్లుగా అది విశ్వాన్ని శోధిస్తున్నది. అయితే.. ఇటీవల దాని కక్ష్య సన్నబడింది. ఫలితంగా స్పేస్‌ టెలిస్కోప్‌పై పనిచేసే నిరోధక శక్తి పెరుగుతున్నది. ఆ కారణంగానే అది భూమిపైన పడిపోయే పరిస్థితి తలెత్తింది. ఉన్నట్టుండి పడిపోవడం కాకుండా.. క్రమేపీ భూమిపైకి జారుతున్నది. అయితే.. ఈ సమయంలో సౌరతుఫానులు పరిస్థితిని మరింత దిగజార్చే అవకాశాలు ఉంటాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సౌర తుఫానుల ప్రభావంతో ఇది భూమికి చేరుకునే వేగం పెరుగుతుందని చెబుతున్నారు.

సెన్సేషన్..ఆ పక్షి పిల్ల కనిపించడం లేదు!

ప్రస్తుతం మన సూర్యుడు సోలార్‌ మాగ్జిమమ్‌ దశలో ఉన్నాడు. ఇది సూర్యునిపై పేలుళ్లు (సోలార్‌ ఫ్లేర్స్‌) ఎక్కువగా చోటుచేసుకునే సమయం. ఇది భూమిచుట్టూ ఉండే వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. ఉపగ్రహాలు, నెటవర్క్స్‌, సిగ్నల్స్‌కు ఇబ్బందులు రావచ్చు. సరిగ్గా ఇదే పరిస్థితిని నీల్ గెహ్రెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ ఎదుర్కొంటున్నది.

ఇది ఎప్పుడు కూలిపోతుందనే విషయంలో రెండు అంచనాలు ఉన్నాయి. నవంబర్‌ 2025లో వేసిన అంచనా ప్రకారం.. 2026 జూన్‌లో కూలిపోయేందుకు 50 శాతం అవకాశాలు ఉన్నాయి. 2027కు ముందే కూలిపోయేందుకు 90 శాతం అవకాశాలు ఉన్నాయి. దాంతో ముందస్తు ప్రణాళికలకు నాసా సిద్ధపడుతున్నది.

2025 లో 4 లక్షల ఉద్యోగాలు ఉఫ్…కొంపలు కూల్చుతున్న ఏఐ

ఈ స్పేస్‌ టెలిస్కోప్‌ను సన్నగా మారుతున్న ఇప్పటి కక్ష్య నుంచి వేరొక సురక్షిత కక్ష్యలోకి చేర్చేందుకు కెటలిస్ట్‌ అనే కంపెనీకి బాధ్యతలు అప్పగించారు. ఈ కంపెనీ 30 మిలియన్‌ డాలర్ల ఖర్చుతో ఒక రోబోటిక్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ను తయారు చేసింది. ఈ స్పేస్‌క్రాఫ్ట్‌.. స్విఫ్ట్‌ టెలిస్కోప్‌ను మరో స్థిరమైన కక్ష్యలోకి తరలిస్తుంది. దీనికి ‘లింక్‌’ అని నామకరణం చేశారు. ఏప్రిల్‌ 14 నుంచి ఈ ‘లింక్‌’ను నాసాకు చెందిన గొడ్డార్డ్‌ స్పేస్‌ ఫ్లైట్‌ సెంటర్‌లో పరీక్షిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్విఫ్ట్‌ జీవితకాలాన్ని కూడా పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

టెలిస్కోప్‌ తన విద్యుత్తు వినిమయాన్ని తగ్గించుకునేందుకు స్విఫ్ట్‌ టీమ్‌ దానిలోని పలు పరికరాలను స్విచ్చాఫ్‌ చేశారు. నిరోధక శక్తిని తగ్గించే ప్రయత్నంలో దాని సోలార్‌ ప్యానెల్స్‌ను రీపొజిషన్‌ చేశారు. లింక్‌ను ఎప్పుడు ప్రయోగిస్తారనే విషయంలో ఇంకా స్పష్టత రానప్పటికీ.. మొత్తానికి ఒక ఆసక్తికర ప్రణాళికతో శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. నిర్దేశిత తేదీనాడు పెగాసస్‌ ఎక్స్‌ఎల్‌ రాకెట్‌.. లింక్‌ను అంతరిక్షంలోకి తీసుకువెళ్లనున్నది. అక్కడి నుంచి ఇది స్విఫ్ట్‌ను వేరొక కక్ష్యలోకి తరలిస్తుంది.

ఇవి కూడా చదవండి..

అఫ్రికన్ పైధాన్ జంట హల్చల్ !
ఆర్థిక శాఖలో 14 మందికి షోకాజ్ నోటీసులు? ఆమ్యామ్యాలు పెద్దవాళ్లకు, నోటీసులు అధికారులకా..
పత్రికా స్వేచ్ఛలో మరింత దిగజారిన భారత ర్యాంకు.. 180 దేశాల జాబితాలో 157 స్థానంలో