విధాత:సర్టిఫైడ్ సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న రైతుల సంఖ్యలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ సర్టిఫైడ్ సేంద్రీయ పంటలు సాగు చేస్తున్న రైతుల సంఖ్య ప్రపంచ దేశాలన్నింటి కంటే భారత్లోనే అత్యధికంగా ఉందని చెప్పారు. అలాగే సర్టిఫైడ్ సేంద్రీయ పంటల సాగు విస్తీర్ణంలో భారత్ ప్రపంచంలో అయిదవ స్థానంలో ఉన్నట్లు తెలిపారు.
పరంపరగత్ కృషి వికాస్ యోజన, మిషన్ ఆర్గానికి వేల్యూ చైన్ డెవలప్మెంట్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజయన్ వంటి పథకాల ద్వారా 2015-16 నుంచి ప్రభుత్వం సేంద్రీయ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ఈ రెండు పథకాల ద్వారా పంట దిగుబడి నుంచి సర్టిఫికేషన్, మార్కెటింగ్ వరకు సేంద్రీయ రైతులకు సంపూర్ణ సహకారం సహాయ సహకారాలను అందిస్తోంది. పంట చేతికి వచ్చిన తర్వాత దానిని ప్రాసెస్, ప్యాకింగ్, మార్కెటింగ్ చేయడం ఈ పథకాలలో అంతర్గత భాగమని ఆయన చెప్పారు.