TS AP Elections : రెండు తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరుగుతున్నది. లోక్సభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్లో భాగంగా దేశవ్యాప్తంగా మొత్తం 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. అందులో తెలంగాణలోని మొత్తం 17 లోక్సభ స్థానాలు, ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లోని మొత్తం 42 లోక్సభ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది.
అదేవిధంగా ఆంధప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా లోక్సభ నాలుగో విడత ఎన్నికల పోలింగ్తోపాటే ఇవాళ జరుగుతోంది. ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు ఇవాళే పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ మొదలైనప్పటి నుంచే ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ రంగ ప్రముఖులంతా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఓటు వేశారు. బీజేపీ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంకా పలువురు ప్రముఖులు ఓటు వేయాల్సి ఉంది.