కాశీబుగ్గలో విషాదం.. ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట, తొమ్మిది మంది మృతి
కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం ఉదయం జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని సృష్టించింది. ఏకాదశి సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలిరావడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగి తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందినట్లు సమాచారం. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఆలయంలో ఏర్పాట్లు సరిగా లేని కారణంగా భక్తులు ఒకరిపై ఒకరు పడిపోవడం వల్లే ఈ విషాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని తెలిసినా, భద్రతా చర్యలు తగిన స్థాయిలో లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతుండగా, ఘటనా స్థలంలో ఉద్రిక్తత నెలకొంది.
అందుబాటులో ఉన్న మృతుల వివరాలు ఇవే..
- మృతులు ఏదూరి చిన్నమ్మ (టెక్కలి రామేశ్వరం)
- మృతులు రాపాక విజయ (టెక్కలి),
- యశోదమ్మ (శివరాంపురం)
- మృతులు నేలమ్మ(దుక్కవానిపాటి),
- రాజేశ్వరి (బెల్లిపటియా)
మంత్రి అనిత, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి – సమగ్ర విచారణకు ఆదేశాలు
కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన ఈ దుర్ఘటనపై రాష్ట్ర హోంమంత్రి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడి సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని, సహాయక చర్యలను వేగవంతం చేయాలని సూచించారు.
శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటన కలచివేసింది. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయాల పాలైన వారికి మేలైన సత్వర చికిత్స అందించాలని అధికారులను ఆదేశించాను. ఘటనా స్థలానికి వెళ్లి…
— N Chandrababu Naidu (@ncbn) November 1, 2025
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో భక్తులు మృతిచెందడం హృదయవిదారకం. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించమని అధికారులను ఆదేశించాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి” అని ప్రకటించారు.
నూతనంగా నిర్మితమైన ఈ ఆలయం గత కొన్ని నెలలుగా ఉత్తరాంధ్ర చిన్న తిరుపతిగా ప్రాచుర్యం పొందుతూ, ప్రతీ వారాంతంలో భారీ రద్దీని చూసింది. అయితే, ఏకాదశి సందర్భంగా భక్తుల తాకిడి పెరిగిన సందర్భంలో సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడమే ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు. కాశీబుగ్గ ఆలయంలో ఆరంభమైన ఆధ్యాత్మిక వేడుకలు ఒక్కసారిగా విషాద ఛాయలు మిగిల్చాయి. భక్తుల ప్రాణాలు బలిగొన్న ఈ తొక్కిసలాట ఉత్తరాంధ్రలో తీవ్ర దుఃఖాన్ని నింపింది.
