HDFC Bank | దేశంలోని అతిపెద్ద ప్రైవేటురంగ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ ఖాతాదారులకు కీలక అలెర్ట్ను జారీ చేసింది. ఈ నెల 13న శనివారం కొన్ని గంటల పాటు బ్యాంక్ సేవలను నిలిచిపోతాయని వెల్లడించింది. ఈ మేరకు బ్యాంకు ఈ మెయిల్స్, ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారం ఇచ్చింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన సిస్టమ్ను అప్డేట్ చేయబోతున్నది. ఫలితంగా ఖాతాదారులకు 13 గంటల పాటు సేవలను నిలిచిపోనున్నాయి. ఖాతాదారులకు ఏవైనా పనులుంటే ముందస్తుగా పూర్తి చేసుకోవాలని, దాంతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండదని చెప్పింది. సిస్టమ్ అప్డేట్ జూలై 13న ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కొనసాగుతుందని పేర్కొంది.
అయితే, ఆ రోజు బ్యాంకుకు సెలవులు దినం కావడంతో అప్డేట్ చేయబోతున్నట్లుగా పేర్కొంది. దాంతో వినియోగదారులపై ఎక్కువగా ప్రభావం ఉండదని పేర్కొంది. కస్టమర్స్కు మెరుగైన ఆన్లైన్ సర్వీసులు అందించేందుకు సిస్టమ్లను అప్డేట్ చేస్తున్నట్లు పేర్కొంది. 13న ఖాతాదారులకు తెల్లవారు జామున 3 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు యూపీఐ సేవలు అందుబాటులో ఉండవు. కొన్ని పరిమితులతో ఉదయం 3 నుంచి 3.45 వరకు, 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు బ్యాంకు ఏటీఎంను ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుంది.
నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు 13 గంటలపాటు పాక్షికంగా పనిచేస్తాయి. అలాగే, బ్యాంక్ ఖాతాకు సంబంధించిన సేవలు, బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేయడం, IMPS, NEFT, RTGS సర్వీసులు పూర్తిగా నిలిచిపోతాయి. దీంతో పాటు బ్యాంక్ పాస్బుక్ డౌన్లోడ్ చేసుకోవడం, ఖాతా తెరవడం సేవలకు సైతం అంతరాయం కలుగుతుంది. బ్యాంకు తెలిపిన వివరాల ప్రకారం.. హెచ్డీఎఫ్సీ కార్డు హోలర్డ్ ఎలాంటి అవాంతరాలు లేకుండా వాడుకోవచ్చని తెలిపింది. క్రెడిట్కార్డులపై సిస్టమ్ అప్డేట్ ప్రభావం ఉండదని పేర్కొంది. ఆన్లైన్ లావాదేవీలు, PoS లావాదేవీలు, బ్యాలెన్స్ ఎంక్వైరీ, పిన్ మార్పు సేవలు యథావిధిగా కొనసాగుతాయని వివరించింది.