విధాత : సినిమా షూటింగ్ సెట్(film shooting incident)లో ఫుట్ పాయిజన్(food poisoning) ఘటన కలకలం రేపింది. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటిస్తున్న ధురంధర్(Dhurandhar) సినిమా సెట్లో భోజనం చేసిన వారు తీవ్ర అస్వస్థత పాలయ్యారు. లద్దాఖ్లోని లేహ్ జిల్లాలో షూటింగ్ విరామంలో సినిమా యూనిట్ సభ్యులు భోజనం చేశారు. కొద్ధిసేపటికి వారంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 600మంది వరకు భోజనం చేయగా..వారిలో 120మందికి పైగా సభ్యులు తిన్న భోజనం వికటించి వాంతులు, విరేచనాల పాలయ్యారు. దీంతో చికిత్స నిమిత్తం వెంటనే వారందరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో సినిమా షూటింగ్ వాయిదా పడింది.
ఆహార శాంపిళ్లను విశ్లేషణ కోసం సేకరించారు. ఫుడ్ పాయిజనింగ్ జరిగినట్లు ఆస్పత్రి డాక్టర్లు చెబుతున్నారు. రణ్వీర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ధురంధర్ సినిమాకు నేషనల్ అవార్డు విన్నర్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ తర్వాత ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్న రెండవ చిత్రం ఇదే కావడం విశేషం. ఈ ఏడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.