విధాత: పశ్చిమాసియా యుద్ద పరిస్థితుల నేపథ్యంలో దేశీయంగా నెలకొన్న వంట గ్యాస్ సిలిండర్ల కొరతను సైబర్ కేటుగాళ్లు సందెట్లో సడేమియా మాదిరిగా… తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గ్యాస్ బుకింగ్ కోసం ఆన్లైన్లో వెతికే అమాయకులే లక్ష్యంగా కొత్త తరహా మోసాలకు తెరతీశారు. ఇదే అంశంపై హైదారబాద్ సీపీ సజ్జనార్ ఎక్స్ వేదికగా ప్రజలను హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు.
తక్షణమే సిలిండర్ డెలివరీ చేస్తామంటూ, అదనపు సిలిండర్లు ఇస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రకటనలు ఇస్తూ బురిడీ కొట్టిస్తున్నారు అని, వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా ఫేక్ వెబ్సైట్ లింకులను పంపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అని సజ్జనార్ వెల్లడించారు. ముఖ్యంగా, ఆన్లైన్లో ముందుగా డబ్బులు చెల్లిస్తే గ్యారెంటీగా, అత్యవసరంగా గ్యాస్ సరఫరా చేస్తామని నమ్మబలికే సందేశాలు వస్తే అవి కచ్చితంగా సైబర్ మోసాలేనని ప్రజలు గ్రహించాలి అని హెచ్చరించారు.
ఇలాంటి అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు అని, చేస్తే మీ ఖాతాలు ఖాళీయేనని అప్రమత్తం చేశారు. సిలిండర్ బుకింగ్ లేదా ఆన్లైన్ చెల్లింపుల కోసం గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్సైట్లను లేదా అధీకృత గ్యాస్ ఏజెన్సీలను మాత్రమే ఆశ్రయించాలి అని, ఆకర్షణీయమైన ఆఫర్లు చూసి గుర్తుతెలియని వ్యక్తులకు మీ బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ, యూపీఐ పిన్ వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకూడదు అని సజ్జనార్ హెచ్చరించారు. నకిలీ వెబ్సైట్లలో మీ వివరాలు నమోదు చేయడం ద్వారా మీ వ్యక్తిగత, ఆర్థిక సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని తెలిపారు.
ఒకవేళ ఎవరైనా ఇలాంటి సైబర్ మోసాలకు గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నెంబర్ 1930 కి కాల్ చేయాలి.లేదా http://cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సజ్జనార్ తెలిపారు
ఇవి కూడా చదవండి :
ఛత్తీస్గఢ్లో లొంగిపోయిన 108 మావోయిస్టులు
Alekya Tarakaratna | తారకరత్నతో ప్రేమ, కుటుంబ విభేదాలు.. మొదటిసారి మనసు విప్పిన అలేఖ్య రెడ్డి
