Varalakshmi Vratham | సాధారణంగా శ్రావణ మాసం( Shravana Masam ) వచ్చిందంటే చాలు మహిళలు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో నిమగ్నమవుతారు. పూజలు, నోములు, వ్రతాలతో నిత్యం తీరిక లేకుండా భక్తిలో మునిగి తేలుతారు. ఇక వరలక్ష్మీ వ్రతం( Varalakshmi Vratham ) పై ప్రత్యేక దృష్టి సారించి ఎంతో శ్రద్ధతో నిర్వహిస్తారు. వరాల తల్లి వరలక్ష్మీ దేవి అనుగ్రహం కోసం ప్రతి మహిళా తమకు తోచిన విధంగా ఈ వ్రతం చేసుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీ శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతం జరుపుకోనున్నారు. మరి ఏ సమయంలో వరలక్ష్మీ వ్రతం జరుపుకోవాలి..? ఎలా జరుపుకోవాలి..? ఏ నియమాలు పాటించాలో ఈ కథనంలో తెలుసుకుందాం..
వరలక్ష్మీ వ్రతం ఏ సమయంలో నిర్వహించాలి..?
ఈ సంవత్సరం వరలక్ష్మీ వ్రతాన్ని ఆగస్టు 8వ తేదీన జరుపుకోబోతున్నారు. అయితే ప్రతి శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. కాబట్టి వరలక్ష్మీ వ్రతానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను ఉదయం 10.30 లోపు పూర్తి చేసుకుంటే మంచిదని పండితులు సూచిస్తున్నారు. అలా వీలు కాని పక్షంలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత చేసుకోవాలని చెబుతున్నారు. కానీ 10.30 నుంచి 12 మధ్య అసలు పూజ చేయకపోవడం మంచిదని సూచిస్తున్నారు. ఈ రోజు వరలక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే అమ్మవారి అనుగ్రహంతో సిరి సంపదలు కలుగుతాయని జీవితంలో డబ్బులకు లోటు ఉండదని విశ్వాసం.
వ్రతం రోజు ఏం చేయాలంటే..?
- వరలక్ష్మీ వ్రతానికి కావాల్సిన వస్తువులన్నింటినీ సిద్ధం చేసుకోవాలి. అంటే పసుపు, కుంకుమ, గంధం, అగరబత్తీలు, హరతి కర్పూరం, కుందులు, వత్తులు, పూలు, పండ్లు, కొబ్బరికాయలు, జాకెట్ ముక్కలు సహా మిగిలిన వస్తువులను ముందుగానే తెచ్చి పెట్టుకోవాలి.
- వ్రతం రోజున సూర్యోదయానికి ముందు గానే లేచి ఇల్లు, వాకిలి శుభ్రం చేసుకుని ఆవు పేడతో నీటిని చల్లుకుని రంగ వల్లులు వేసుకోవాలి.
- తలస్నానం చేసి ఇంటి దర్వాజాకు పసుపు, కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. అలాగే దర్వాజాకు మామిడి తోరణాలు కట్టాలి. పూజ గదిని క్లీన్ చేసుకుని నిత్యం చేసుకునే విధంగా పూజ పూర్తి చేయాలి.
- 3 లేదా 5 లేదా 9 లేదా 11 రకాల నైవేద్యాలను సిద్ధం చేసుకోవాలి. వరలక్ష్మీ అమ్మవారికి ఆవుపాలతో చేసిన పరమాన్నం అంటే ఇష్టం.
అనంతరం వ్రతాన్ని ప్రారంభించి.. శ్రద్ధతో నిర్వహించాలి.