ప్రతి వ్యక్తిని దోషాలు వెంటాడుతూ ఉంటాయి. ఆ దోషాలను తొలగించుకునేందుకు వారు వెళ్లని ఆలయం ఉండదు.. మొక్కని దేవుడు ఉండడు. ఇక ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.. ఆధ్యాత్మిక ప్రపంచంలో మునిగిపోతారు. దోషాలు తొలగించి.. సుఖసంతోషాలు, సిరిసంపదలు ప్రసాదించు భగవంతుడా..! అని కోరుకుకుంటారు. కానీ ఫలితం అంతగా ఉండదు. దోషాలు తొలగిపోవాలంటే.. ప్రతి బుధవారం ఇలా విఘ్నేశ్వరుడిని పూజిస్తే చక్కటి ఫలితాలు వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి దోషాలు తొలగాలంటే గణనాథుడిని ఎలా పూజించాలో తెలుసుకుందాం..
సూర్యదోష నివారణకు ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాలి. చంద్ర దోష నివారణకు వెండి లేక పాలరాయితో చేసిన వినాయకుడిని పూజించాలి. కుజదోష నివారణకు రాగితో చేసిన వినాయకుడిని పూజిస్తే ఫలితం ఉంటుంది. బుధ దోష నివారణకు మరకత గణపతిని అర్చించాలి. గురు దోష నివారణకు పసుపు, చందనం లేక బంగారంతో చేసిన గణపతిని కొలవాలి. శుక్ర దోష నివారణకు స్ఫటిక గణపతిని పూజించాలి. శని దోష నివారణకు నల్లరాయిపై చెక్కిన గణపతిని పూజించాలి.
రాహు గ్రహ దోషానికి మట్టితో చేసిన గణపతిని పుజిస్తే ఫలితం ఉంటుంది. కేతు గ్రహ దోష నివారణకు తెల్ల జిల్లేడుతో చేసిన గణపతిని పూజించాలి. ఇక చెక్క రూపంలో ఉన్న గణేషున్ని పూజిస్తే ఆరోగ్యం, పగడపు గణపతిని పూజించడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి. పాలరాయితో చేసిన గణపతిఅని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. మనకు ఎదురవుతున్న సమస్యలు తొలగిపోవాలంటే శ్వేతార్క గణపతిని పూజించాలి. రావి ఆకు రూపంలో ఉన్న వినాయకుడిని పూజిస్తే ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. భక్తితో, శ్రద్ధతో ఎంత పూజిస్తే అంతకు రెట్టింపు ఫలితం ఇస్తాడు. ఇక ఆలస్యం ఎందుకు విఘ్నేశ్వరుడిని పూజించి సకల కోరికలను నెరవేర్చుకోండి.