Shirdi Sai | ప్రతి గురువారం చాలా మంది భక్తులు షిర్డీ సాయినాథుడిని పూజిస్తారు. భక్తిశ్రద్ధలతో షిర్డీ సాయి( Shirdi Sai )ని పూజిస్తే.. కోరిన కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా సాయిబాబా వ్రతాన్ని తొమ్మిది గురువారాలు ఆచరిస్తే అసంపూర్తిగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆర్థిక కష్టాల నుంచి కూడా బయటపడుతామని భక్తుల నమ్మకం. ప్రధానంగా గురువారం సాయినాథుడిని ఎలా పూజించాలో తెలుసుకుందాం.
గురువారం వేకువజామునే మేల్కొనాలి. అభ్యంగన స్నానం ఆచరించాలి. పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. అనంతరం సాయినాథుడి పటాన్ని కానీ, విగ్రహాన్నీ కానీ అలంకరించుకోవాలి. నెయ్యితో దీపం వెలిగించాలి. సాయినాథుడికి ఎంతో ఇష్టమైన పసుపు రంగు పూలతో పూజించాలి. పసుపు రంగులో ఉండే నిమ్మకాయ పులిహోర, మామిడి పండ్లు, అరటి పండ్లను నైవేద్యంగా పెట్టాలి. అనంతరం బాబాకు హారతి పాటలు పాడుకుంటూ మంగళ హారతులు ఇవ్వాలి. పూజా అనంతరం ప్రసాదాలను అందరికీ పంచిపెట్టాలి.
పూజ పూర్తయ్యాక చేసే దానాల వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది. పేదలకు దానం చేసే వారి పట్ల సాయిబాబా కనికరిస్తాడు. అన్ని దానాలలో కెల్లా అన్న దానం శ్రేష్ఠం. అందుకే గురువారం అన్నదానం చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని అంటారు. అసలు సంపద పెరగడానికి సులభమైన మార్గం దానాలు చేయడమే అని హిందూ ధర్మ శాస్త్రం చెబుతోంది.
సాయినాథుని పూజలో భక్తే ప్రధానం. భక్తి లేకుండా ఎంత ఘనంగా పూజ చేసినా ఫలితం ఉండదు. భక్తితో ఒక్క పువ్వు సమర్పించినా సాయి బాబా సంతోషిస్తాడు. అసలు బాబా వారికి సమర్పించాల్సింది మన మనసనే పుష్పాన్ని. భక్తితో శరణాగతి చేస్తే సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది. ఓం శ్రీ సాయినాథాయ నమః