CM Revanth Reddy Declares Koti Deepotsavam as Telangana State Festival
(విధాత సిటీ బ్యూరో)
హైదరాబాద్ :
Deepotsavam State Festival | హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. కార్తీకమాసం సందర్భంగా ప్రతీ ఏటా జరిగే ఈ మహోత్సవం ఈసారి మరింత ఆధ్యాత్మికంగా, మహిమాన్వితంగా సాగుతోంది. ఎనిమిదో రోజు ఎన్టీఆర్ స్టేడియం శివభక్తి జ్యోతులతో మిన్నంటగా, ఆ ప్రాంగణం భక్తి, ఆరాధనల కాంతులతో నిండిపోయింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీ సమేతంగా ఈ వేడుకలకు హాజరయ్యారు. సీఎం రేవంత్ దంపతులను వేదమంత్రాల నడుమ తుమ్మల నరేంద్ర చౌదరి, రమాదేవీ దంపతులు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ కోటి దీపోత్సవాన్ని రాష్ట్రపండుగగా గుర్తిస్తామని ప్రకటించారు. అంతేకాదు, జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా నరేంద్ర చౌదరి దంపతులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా భక్తుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారని అన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రారంభమైన ఈ మహోత్సవం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు దాటి ఇప్పుడు ప్రపంచంలోని భక్తులందరికీ శివనామస్మరణను వినిపిస్తోందని సీఎం రేవంత్ ప్రశంసించారు.
ఈ కార్యక్రమానికి తాను హాజరైన రోజే తన జన్మదినం కావడం జీవితకాలం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చే సంవత్సరం నుంచి కోటి దీపోత్సవాన్ని అధికారిక రాష్ట్రపండుగగా గుర్తించి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు, ఈ ఉత్సవానికి జాతీయ స్థాయి గుర్తింపు రావాలని, పీఎం మోడీకి లేఖ రాయనున్నట్లు తెలిపారు.
సీఎం రేవంత్ మాట్లాడుతూ ఎంత కష్టంలో ఉన్నా ఈ మహోత్సవంలో పాల్గొంటే గొప్ప ఆధ్యాత్మిక శక్తి లభిస్తుందని, ఆ శక్తితో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. కోటి దీపోత్సవం ఆధ్యాత్మికత, విశ్వాసం, సాంస్కృతిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
