Visa Free | విదేశాలకు వెళ్లాలంటే వీసా (Visa) తప్పనిసరని అందరికీ తెలుసు. అయితే, కొన్ని దేశాలు మాత్రం వీసా లేకుండానే (Visa Free) తమ దేశంలోకి ప్రవేశించే అవకాశాన్ని కల్పిస్తుంటాయి. ఇప్పటికే కొన్ని దేశాలు ఈ వెసులుబాటును కల్పిస్తున్నాయి. తాజాగా డ్రాగన్ కంట్రీ చైనా సైతం ఇప్పుడు ప్రపంచానికి తన తలుపులను బార్లా తెరుస్తోంది. ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు పర్యాటకమే ప్రధాన అస్త్రమని భావిస్తున్న చైనా ప్రభుత్వం.. పలు దేశాల పౌరులకు వీసా ఫ్రీ ఎంట్రీని (China Visa Free Entry) కల్పిస్తోంది.
అర్హత కలిగిన దేశాలు ఇవే..
ఇందులో భాగంగానే తాజాగా దాదాపు 50 దేశాల (50 countries) పౌరులకు వీసా ఫ్రీ ఎంట్రీ కల్పిస్తున్నట్లు చైనా ప్రకటించింది. బ్రూనై, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, ఐర్లాండ్, హంగేరీ, ఆస్ట్రియా, బెల్జియం, లక్సెంబర్గ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పోలాండ్, పోర్చుగల్, గ్రీస్, సైప్రస్, స్లోవేనియా, స్లోవేకియా, నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్, అండొర్రా, మొనాకో, లీచ్టెన్స్టెయిన్, దక్షిణ కొరియా, బల్గేరియా, రొమేనియా, క్రొయేషియా, మోంటెనెగ్రో, నార్త్ మాసిడోనియా, మాల్టా, ఎస్టోనియా, లాట్వియా, జపాన్, బ్రెజిల్, అర్జెంటీనా, చిలీ, పెరూ, ఉరుగ్వే, సౌదీ అరేబియా, ఒమన్, కువైట్, బహ్రెయిన్, రష్యా, స్వీడన్, కెనడా, యూకే.. ఈ దేశాల ప్రజలు ఇకపై చైనాకు వీసా లేకుండానే ప్రయాణాలు సాగించొచ్చు. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ అధికారికంగా ప్రకటించారు. పర్యాటక రంగాన్ని పునరుద్ధరించడం, వాణిజ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో డ్రాగన్ దేశం ఈ నిర్ణయం తీసుకుంది.
భారత్ ఉందా..?
అయితే, ఈ 50 దేశాల జాబితాలో భారత్ లేకపోవడం గమనార్హం. చైనా తన వీసా-రహిత జాబితాను ఆయా దేశాలతో ఉన్న దౌత్యపరమైన బంధాల ఆధారంగా నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న సున్నితమైన సరిహద్దు వివాదమే వీసా ఫ్రీ ఎంట్రీ కల్పించకపోవడానికి ప్రధాన కారణం. అంతేకాదు. రాజకీయ ఉద్రిక్తతలు, భద్రతాపరమైన ఆందోళనల కారణంగా ఇండియన్స్కు డ్రాగన్ దేశం వీసా ఫ్రీ వెసులుబాటును కల్పించడం లేదు. చైనా తన దేశంలోకి విదేశీయుల ప్రవేశాన్ని, ముఖ్యంగా భారత్ వంటి పొరుగు దేశాల పౌరుల విషయంలో కఠిన వైఖరితో ఉంటుంది. కఠినమైన భద్రతా తనిఖీల తర్వాతే వారిని అనుమతిస్తుంది. ప్రస్తుతానికి భారతీయ పౌరులు చైనాను విజిట్ చేయాలంటే.. ఆన్లైన్ లేదా కాన్సులేట్ ద్వారా వీసా తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది.
మనదేశంతోపాటూ పాకిస్థాన్కు కూడా చోటు దక్కలేదు. ఇక తాజా నిబంధనల ప్రకారం.. అర్హత కలిగిన విదేశీ పౌరులు ఎలాంటి వీసా లేకుండానే 30 రోజుల వరకూ చైనాలో నివసించొచ్చు. కానీ, ఉద్యోగం చేయడం, డబ్బు సంపాదించడం వంటివి చేయకూడదు. 30 రోజుల కంటే ఎక్కువ కాలం ఉండాలనుకునే వారు సాధారణ ప్రక్రియ ద్వారా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి :
Viral News | స్క్రాప్ అనుకొని రూ.15 లక్షల విలువైన బంగారాన్ని అమ్మేశాడు.. తర్వాత ఏం జరిగిందంటే..?
Coffin Homes | 16 స్క్వేర్ ఫీట్ రూమ్ అద్దె రూ.40 వేలు.. కాఫిన్ హోమ్స్లో మగ్గుతున్న పేదల జీవితాలు
