న్యూఢిల్లీ : అమెరికాలో విమాన ప్రమాదంలో ఏడుగురు మరణించారు. కెంటుకీలోని లూయిస్విల్లేలోని మహ్మద్ అలీ విమానాశ్రయం నుండి బయలుదేరుతుండగా యూపీఎస్ కార్గో విమానం టేకాఫ్ సమయంలో ప్రమాదానికి గురైంది. టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో 11 మంది తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. విమానం గాల్లోకి ఎగురుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగసి కుప్పకూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఈ విమానం మెక్డోనెల్ డగ్లస్ ఎండీ-11 రకానికి చెందిన సరుకు రవాణా విమానం అని కెంటుకీ గవర్నర్ ఆండీ బెషీర్ వెల్లడించారు. విమానంలోని సిబ్బంది ముగ్గురు, విమానం కూలిన ప్రాంతంలోని స్థానికులు నలుగురు ప్రమాదంలో మరణించారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని ఆయన తెలిపారు. ప్రమాదంపై విమానయాన శాఖ దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు.
