Site icon vidhaatha

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో MLC కవిత మాజీ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ అరెస్ట్‌..!

హైదరాబాద్‌ : ఢిల్లీ లిక్కర్‌ పాలసీ స్కామ్‌లో కీలక మలుపు చోటు చేసుకున్నది. హైదరాబాద్‌కు చెందిన చార్టర్ట్‌ అకౌంటెంట్‌ గోరంట్ల బుచ్చిబాబును అరెస్టు చేసినట్లు సీబీఐ తెలిపింది. రామచంద్ర పిళ్లైకి గోరంట్ల బుచ్చిబాబు సీఏగా వ్యవహరించారు. బుచ్చిబాబు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు గతంలో చార్టర్‌ అకౌంటెంట్‌గా పని చేశారు.

ఇంతకు ముందు బుచ్చిబాబు ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ రూపకల్పనతో పాటు అమలులో బుచ్చిబాబు సైతం కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలున్నాయి. హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలకు లబ్ధిచేకూర్చేలా వ్యవహరించారని కేసు నమోదు చేసింది.

ఈ వ్యవహారంలో ఆప్‌ నేతల తరఫున సౌత్‌గ్రూప్ నుంచి రూ. 100 కోట్ల ముడుపులు సేకరించింది విజయ్‌ నాయరేనని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పేర్కొంది. సౌత్‌ గ్రూపులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత, వైఎస్సార్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్‌ మాగుంట, అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌చంద్రారెడ్డి ఉన్నారు.

అయితే.. ఆ గ్రూప్‌నకు అభిషేక్‌ బోయినపల్లి, అరుణ్‌ పిళ్లై, బుచ్చిబాబు ప్రాతినిధ్యం వహించారు. ఈ క్రమంలోనే బుచ్చిబాబును మంగళవారం సీబీఐ అధికారులు విచారించారు. విచారణ అనంతరం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం బుచ్చిబాబును అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఈ రోజు బుచ్చిబాబును రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరుచనున్నారు.

మరో కీలక వ్యక్తి అరెస్ట్

ఢిల్లీ లిక్క‌ర్ కుంభకోణంలో ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అధికారులు దూసుకెళుతున్నారు. లిక్క‌ర్‌ విధానంలో మార్పులకు కీలకపాత్ర వహించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రా ను ఈడీ అరెస్ట్ చేశారు. కాగా.. నేటి ఉదయం ఎమ్మెల్సీ కవిత మాజీ సహాయకుడు, ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

కాగా.. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత గౌతమ్ మల్హోత్రాను సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈడీ అధికారులు హాజరు పరచనున్నారు. గత రాత్రి మల్హోత్రాను ఈడీ కస్టడీలోకి తీసుకుంది. ఓ పొలిటిక‌ల్‌ పార్టీకి చెందిన పలువురు నేతలతో డబ్బు లావాదేవీల్లో గౌతమ్ మల్హోత్రాకు భాగస్వామ్యం ఉన్నట్లు ఈడీ వెల్లడించింది.

Exit mobile version