IRCTC Tour Packages |
తిరుమల శ్రీవారి భక్తుల కోసం ఐఆర్సీటీసీ బంపర్ ఆఫర్ను ప్రకటించింది. ఈ ప్యాకేజీలో తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకోవడంతో పాటు తిరుచానూరు పద్మావతి అమ్మవారు, కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం, శ్రీకాళహస్తి తదితర పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నది. తక్కువ ధరలకే ఈ ప్యాకేజీని ప్రకటించింది.
తిరుపతి బాలాజీ దర్శనం ఎక్స్ హైదరాబాద్ (TIRUPATI BALAJI DARSHNAM EX HYDERABAD) పేరుతో ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీలో విమానంలో హైదరాబాద్ నుంచి తిరుమలకు ప్రయాణం ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ రెండురోజుల పాటు కొనసాగుతున్నది.
ప్యాకేజీలో తిరుమల, కాణిపాకం, శ్రీనివాసమంగాపురం, శ్రీకాళహస్తి, తిరుచానూరు, తిరుపతిని సందర్శించవచ్చు. ప్యాకేజీ జూన్ 1, 8, 15, 20, 22, 27 తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అలాగే జూలై నెలలో 4, 6, 20, 25 తేదీల్లో ఉంటుంది. టూర్ ధర రూ. 14645 నుంచి ప్రారంభంకానున్నది.
డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి రేటు వర్తించనున్నది. సింగిల్ ఆక్యుపెన్సీ అయితే రూ.16,330 చెల్లించాల్సి ఉంటుంది. ట్రిపుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి రూ.14,500 చెల్లించాల్సి వస్తుంది. పిల్లలకు బెడ్తో కలిసి రూ.13,740, విత్ అవుట్ బెడ్తో రూ.13,490. టూర్ హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది.
మధ్యాహ్నం ఒంటిగంటకు విమానంలో బయలుదేరాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి తిరుపతి, హైదరాబాద్ – తిరుపతి విమానం చార్జీలన్నీ ప్యాకేజీలోనే ఐఆర్సీటీసీ భరిస్తుంది. తిరుపతిలో రాత్రికి ఏసీ హోటల్లో వసతి ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ప్యాకేజీలోనే అందుబాటులో ఉంటాయి. ఏసీ కోచ్ టూర్ వెహికల్ ఉంటుంది.
తిరుమల, తిరుచానూరు, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీనివాస మంగాపూరంలో దర్శనాలు చేసుకోవచ్చు. గైడ్ సర్వీస్ సైతం అందుబాటులో ఉంటుంది. ప్యాకేజీలో ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. కాగా, దర్శన సమయంలో డ్రెస్ కోడ్ను పాటించాల్సి ఉంటుందని ఐఆర్సీటీసీ తెలిపింది.