మోదీ, కేసీఆర్ పోతేనే.. ప్రజాస్వామ్యానికి రక్షణ: రేవంత్‌రెడ్డి

ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్‌ పోరాడుతుంద‌న్న రేవంత్‌ చేయి చేయి కలుపుదాం యాత్రలో పాల్గొనాల‌ని పిలుపు విధాత: కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా.. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. బీజేపీ దేశ ప్రయోజనాలు మరిచి పార్టీ ఎజెండా రాజకీయాలు చేస్తుంటే, కేసీఆర్‌ తన కుటుంబానికి రాష్ట్రాన్ని దోచి పెట్టింది చాలక బీఆర్‌ఎస్‌ పేరుతో దేశంపై పడ్డారని విమర్శించారు. మోదీ నేతృత్వంలో బీజేపీ పూర్తిగా ప్రజలను విస్మరించిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. హిమాచల్‌ ప్రదేశ్‌ […]

  • Publish Date - December 28, 2022 / 11:08 AM IST
  • ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్‌ పోరాడుతుంద‌న్న రేవంత్‌
  • చేయి చేయి కలుపుదాం యాత్రలో పాల్గొనాల‌ని పిలుపు

విధాత: కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా.. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. బీజేపీ దేశ ప్రయోజనాలు మరిచి పార్టీ ఎజెండా రాజకీయాలు చేస్తుంటే, కేసీఆర్‌ తన కుటుంబానికి రాష్ట్రాన్ని దోచి పెట్టింది చాలక బీఆర్‌ఎస్‌ పేరుతో దేశంపై పడ్డారని విమర్శించారు.

మోదీ నేతృత్వంలో బీజేపీ పూర్తిగా ప్రజలను విస్మరించిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. హిమాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దులో చైనా దురాక్రమణలకు పాల్పడుతున్నా మోదీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. బీజేపీ పరివారానికి దేశం కన్నా వారి పార్టీ, ఎన్నికల్లో గెల‌వ‌డ‌మే ఎక్కువైంద‌ని ఆయన విమర్శించారు. దేశంలో ప్రజలు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు పడుతున్న అవస్థలు మోదీకి పట్టటం లేదని రేవంత్‌ దుయ్యబట్టారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో వెలగబెట్టింది చాలక దేశం మీద పడుతున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన లేదు, తండ్రి, కొడుకులదే రాజ్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నిత్యం మాటల గారడీతో ప్రజలను మాయ చేయటం తప్ప చేసిందేమీ లేదని కేసీఆర్‌ ప్రభుత్వాన్ని విమర్శిచారు.

రాష్ట్రంలో కేసీఆర్‌, దేశంలో బీజేపీ పోయిన నాడే ప్రజలకు ప్రజాస్వామ్య ఫ‌లాలు ద‌క్కుతాయ‌ని రేవంత్‌ అన్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ ప్రజాస్వామ్య పరిరక్షణకు కట్టుబడి ఉన్నదని, అందుకు ఎంతటి త్యాగాలకైనా సిద్ధమని రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

దేశ సమగ్రత కోసం రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు మద్దతుగా అన్ని రాష్ట్రాల్లో నియోజక వర్గాల వారీగా హాత్‌ సే హాత్‌ జోడ్‌కర్‌ (చేయి చేయి కలుపుదాం) పేరిట యాత్రలు చేస్తామని రేవంత్‌ ప్రకటించారు. కాంగ్రెస్‌ శ్రేణులన్నీ ఈ యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.