Site icon vidhaatha

Monsoon | ఈ ఏడాది.. సాధారణ వర్షాలే: IMD

విధాత‌: భారతదేశానికి రుతుపవనాలు (Monsoon) అత్యంత కీలకమైనవి. దాదాపు 40శాతం పంట ఉత్పత్తులు వచ్చే 51 శాతం సాగు భూమికి వర్షాలే ఆధారం. ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా ఆధారపడేదీ, వివిధ వృత్తుల వారు చూసేదీ వ్యవసాయ రంగం వైపే.

దీంతో రుతుపవనాలు ఎలా ఉంటాన్న ఆసక్తి రైతులతోపాటు.. అన్ని వర్గాల్లోనూ ఉంటుంది. ఎల్‌నినో పరిస్థితులు క్రమంగా పంజుకునే అవకాశాలు ఉన్నాయని గతంలోనే అంచనాలు వెలువడ్డాయి.

అయితే.. అటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఈ ఏడాది సాధారణ వర్షపాతమే నమోదవుతుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. వాయవ్య భారతదేశంలో దీర్ఘకాలిక సగటుతో పోల్చితే 92శాతం వర్షపాతం నమోదవుతుందని, ఇతర అన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం ఉంటుందని తెలిపింది.

మొత్తంగా 96శాతం నుంచి 104 శాతం మధ్య వర్షపాతాన్ని ఆశించవచ్చునని పేర్కొన్నది. 1971 నుంచి 2020 వరకు కురిసిన వర్షపాతం డాటా ఆధారంగా దీర్ఘకాలిక సగటును లెక్కిస్తారు. అంటే సగటున 94శాతం నుంచి 106 శాతం మధ్య వర్షపాతం కురిస్తే దానిని సగటుగా తీసుకుంటారు.

ఇది ఎల్‌ నినో సంవత్సరమని, వాయవ్య, మధ్య భారతంలో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నదని, ఈశాన్య ప్రాంతంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కురిసే అవకాశం ఉన్నదని ఐంఎడీలోని వాతావరణ పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం (ఈఎంఆర్‌సీ) అధిపతి డీఎస్‌ పాయి వెల్లడించారు. తమ అంచనాల ఆధారణంగా వ్యవసాయ రంగంలో ప్రాంతీయంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన సూచించారు.

Exit mobile version