Minister Jagadeesh Reddy
విధాత: విద్యుత్తు ఫైల్స్ ఓపెన్ కు ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. పారదర్శకతకు ముఖ్యమంత్రి KCR పాలన పెట్టింది పేరని, ఇందులో దాపరికం అంటూ ఏమి లేదని ఆయన తేల్చిచెప్పారు. అయితే అదే సమయంలో విద్యుత్తు కొనుగోలు ఫైల్స్ పై చర్చ జరగాలని సవాల్ విసిరిన PCC నేత రేవంత్ రెడ్డి మాజీ బాస్, తాజా బాస్ అని చెప్పుకుంటున్న చంద్రబాబు, YS పాలనలో జరిగిన ఒప్పందాల ఫైల్స్ పై బహిరంగ చర్చకు సిద్ధమా అని రేవంత్ రెడ్డికి జగదీశ్రెడ్డి సవాల్ విసిరారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 1995 నుండి 2004 వరకు చంద్రబాబు పాలనలో, 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ పాలనలోనీ ఫైల్స్ ను కుడా బహిర్గతం చేసి చర్చకు దిగుదామని ఆయన రేవంత్ కు ప్రతి సవాల్ విసిరారు. విద్యుత్తు కొనుగోలుపై కాంగ్రెస్ పార్టీ నేతలు అవగాహాన లేమితో అవాకులు చెవాకులు పెలుతున్నారన్నారు.
24 గంటల విద్యుత్తు సరఫరాలో కాంగ్రెస్ పార్టీ దొరికి పోయిన దొంగ అని , ఇప్పుడు AICCని రంగంలోకి దించి బుకాయింపు చర్యలకు దిగుతుందని దుయ్యబట్టారు. ఒక అబద్దాన్ని దాచడం కోసం 100 అబద్దాలు ఆడుతున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని జగదీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. మరోమారు దొంగ డ్రామాలతో తెలంగాణా రైతాంగాన్ని మోసం చేసే కుట్రలకు కాంగ్రెస్ పార్టీ తెర లేపిందని ఆరోపించారు. 2014 కు ముందు రేవంత్ రెడ్డి కొత్త, పాత బాస్ ల కాలంలో గొంతు తడుపుకునేందుకు గుక్కెడు త్రాగు నీళ్లు ఇచ్చిన పాపాన పోలేదని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలకు నాశనమైన నల్లగొండ జిల్లా దృష్టాంతమే చక్కటి నిదర్శనమన్నారు. వీరి పాపపు పాలనకు పరాకాష్టనే రెండున్నర లక్షల మంది ఫ్లోరోసిస్ వ్యాధి గ్రస్తులు అయ్యారని ఆయన ధ్వజమెత్తారు.
నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఏనాడైనా వరుసగా రెండు పంటలకు నీళ్లు ఇచ్చిన చరిత్ర 2014 కు ముందు రికార్డ్ అయ్యిందా అని ఆయన కాంగ్రెస్ నేతలను నిలదీశారు. కాంగ్రెస్ పాలనలో మొదటి పంటకు నీళ్లు ఎంత ఇచ్చారని..సాగులోకి ఎంత వచ్చింది..రెండో పంటకు ఎన్ని సార్లు నీళ్లు ఇచ్చారు..ధాన్యం ఉత్పత్తి ఎంత అయ్యింది అన్న లెక్కలు కుడా బయట పెట్టి చర్చించాల్సిందేనన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మీదటనే సాగర్ ఎడమ కాలువ కింద భూములకు వరుసగా 16 పంటలకు నీళ్లు ఇచ్చామని దాని ఫలితమే ధాన్యం ఉత్పత్తిలో రికార్డు సాధించడమన్నారు. అదంతా ముమ్మాటికి ముఖ్యమంత్రి KCR కృషి ఫలితమే నని ఆయన కొనియాడారు.
తెలంగాణా రైతాంగం చైతన్యవంతులని వారి ముందు కాంగ్రెస్ పార్టీ జిమ్మిక్కులు చెల్ల నెరవన్నారు. 24 గంటల విద్యుత్తు పై AICC అదేశాలనే టి PCC పాటిస్తుందని దీనిపై చర్చ జరగాల్సిందే నన్నారు. అందుకు రైతు వేదికలు, రచ్చ బండలు వేదిక అవుతాయన్నారు. ఏ రూట్ లో వచ్చినా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎదుర్కొనేందుకు ఇక్కడి రైతాంగం సిద్దంగా ఉన్నారన్నారు. మూడు గంటల కరెంటు అన్నందుకు కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు . అదే సమయంలో మూడు పంటలకు నీళ్ళు ఇస్తున్న ముఖ్యమంత్రి KCR పక్షాన రైతాంగాం పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.