విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క తెలిపారు. సోమవారం ఆమె మేడారంలో జాతర పనులను పరిశీలించారు. సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకున్నారు.
ముందుగా పస్రాలోని గుండ్ల వాగు బ్రిడ్జి, దయ్యలవాగు సమీపంలో ఉన్న రోడ్డు, చింతల్ క్రాస్ రోడ్డు, పార్కింగ్ స్థలాలను, అనంతరం ఊరట్టం బ్రిడ్జి, వాహనాల పార్కింగ్ స్థలాలు, చిలుకల గుట్ట, వీఐపీ పార్కింగ్, బస్ స్టాండ్ ను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి, పనులు వేగవంతం చేసే విధంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ములుగు ఎస్పీ గౌస్ ఆలం, జిల్లా అదనపు కలెక్టర్, డీఎస్పీ రవీందర్, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.