Site icon vidhaatha

హిండన్‌బర్గ్‌ రిపోర్టు ఫలితం: 50 బిలియన్‌ డాలర్ల దిగువకు పడిపోయిన అదానీ సంపద

విధాత : హిండెన్‌బర్గ్‌ (Hindenburg) నివేదిక గౌతం అదానీ (Gautam Adani) కంపెనీలపై ఇంకా ప్రభావం చూపుతూనే ఉన్నది. ఫిబ్రవరి 20వ తేదీ నాటికి అదానీ మొత్తం సంపద 48 బిలియన్‌ డాలర్లకు పడిపోయిందని ఫోర్బ్స్‌ (Forbes) తాజాగా అంచనా వేసింది. బ్లూంబర్గ్‌ అంచనా ప్రకారం ఆయన సంపద 49 బిలియన్‌ డాలర్లు.

దీని ప్రకారం అదానీ ప్రపంచ కుబేరుల్లో (wealthiest person in the world) 25 స్థానంలో ఉన్నారని రెండు సంస్థలు పేర్కొన్నాయి. అదానీ సంపద 50 బిలియన్‌ డాలర్లలోపు ఉండటం ఇటీవలి సంవత్సరాల్లో ఇదే మొదటిసారి. ముందు రోజుతో పోల్చుకుంటే 2.7 బిలియన్‌ డాలర్లు ఆయన నష్టపోయారని ఫోర్బ్స్‌, 1.15 బిలియన్‌ డాలర్లు నష్టపోయారని బ్లూంబర్గ్‌ పేర్కొన్నాయి.

కదులుతున్న వ్యాపార సామ్రాజ్య పునాదులు

హిండెన్ బ‌ర్గ్ రిపోర్టుతో గౌత‌మ్ అదానీ వ్యాపార సామ్రాజ్యం పునాదులు క‌దిలిపోతున్నాయి.

మ‌నీలాండ‌రింగ్ అనుమానాలు

అదానీ గ్రూప్ విస్త‌ర‌ణ వెనుక 30 ఏండ్లుగా అనేక దేశాల్లో న‌డుస్తున్న మ‌నీలాండ‌రింగ్ కార్య‌క‌లాపాలు దాగి ఉన్నాయ‌న్న అనుమానాలు ఇప్పుడు వ్య‌క్తమ‌వుతుండ‌టం గ‌మ‌నార్హం. షెల్ కంపెనీల‌ను సృష్టించి, త‌ప్పుడు డాక్యుమెంట్ల‌ను త‌యారుచేసి గౌత‌మ్ అదానీ ఒక్కో మెట్టూ ఎక్కుతూ వ‌చ్చార‌న్న వాద‌న‌లున్నాయి.

ఏంటీ హిండెన్‌బర్గ్‌?

అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ అనేది ఓ ష్టార్ట్ సెల్లింగ్ కార్య‌క‌లాపాల సంస్థ‌. న్యూయార్క్ కేంద్రంగా ఆరేండ్ల క్రితమే మొద‌లైంది. స్టాక్ మార్కెట్ల‌లో అక్ర‌మంగా షేర్ల విలువ‌ను పెంచుకునే సంస్థ‌ల‌ను టార్గెట్ చేస్తుంది. వాటి షేర్ ధ‌ర‌లు ప‌డిపోయేలా చేసి, ఆ త‌ర్వాత కొంటుంది.

ఈ త‌ర‌హా సంస్థ‌లు మార్కెట్‌లో లిస్టింగ్ కంపెనీల‌కు ఓ పెద్ద స‌మ‌స్య‌గా మారాయ‌నే చెప్పుకోవ‌చ్చు. పోంజీ స్కీంల‌ను వెలుగులోకి తేవ‌డంలో సిద్ధ‌హ‌స్తుడైన నాథ‌న్ అండ‌ర్స‌న్ హిండెన్‌బర్గ్‌ వ్య‌వ‌స్థాప‌కుడు. మ‌దుప‌రుల‌ను ర‌క్షించ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని చెప్పే ఈ సంస్థ ఇప్ప‌టికే ప‌లు గ్లోబ‌ల్ సంస్థ‌ల ర‌హ‌స్యాల‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేసి వాటి షేర్ల‌ను కుప్ప‌కూల్చింది.

హిండెన్‌బర్గ్‌ ఏం చెప్పింది?

అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువ 85 శాతం క‌ల్పిత‌మేన‌ని హిండెన్‌బర్గ్‌ త‌న నివేదిక‌లో పేర్కొన్న‌ది. వీటిని కొన‌వ‌ద్ద‌ని మ‌దుప‌రుల‌ను హెచ్చ‌రించింది. షేర్ల ధ‌ర‌ల‌ను పెంచ‌డానికి అదానీ గ్రూప్ భారీ అవ‌క‌త‌వ‌క‌లకు పాల్ప‌డింద‌ని రుజువుల‌తో స‌హా ఆరోపించింది. ఈ క్ర‌మంలోనే పెద్ద ఎత్తున అప్పులు చేసింద‌న్న‌ది. ప్ర‌స్తుతం గ్రూప్ రుణ భారం రూ.2.31 ల‌క్ష‌ల కోట్ల‌పైనే ఉంద‌ని తెలిపింది. ఇక గ్రూప్ డైరెక్ట‌ర్ల‌లోనూ అదానీ కుటుంబ స‌భ్యులే ఉన్నార‌న్న‌ది. అంటే.. రౌండ్‌ ట్రిప్పింగ్‌, సర్క్యులర్‌ ట్రేడింగ్‌ వంటి అడ్డదారులను వాడుకుని కంపెనీ ఎదిగిందే తప్ప.. నిజంగా షేర్ల విలువలు పెరగటం కాదనేది అర్థమైపోతున్నది.

Exit mobile version