Uttar Pradesh by poll | ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఎంపీ, రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని సమాజ్వాదీ పార్టీ వెనక్కి నెట్టేసింది. ఉప ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. మెయిన్పురి, రాంపూర్ నుంచి ఎస్పీ అభ్యర్థులు పోటీ చేయగా, కతౌలి నుంచి ఆర్ఎల్డీ అభ్యర్థి బరిలో ఉన్నారు. మూడు స్థానాల్లోనూ ఎస్పీ, ఆర్ఎల్డీ ఆధిక్యంలో ఉన్నాయి.
ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్పురి ఎంపీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానం నుంచి ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ పోటీ చేశారు. ఈ స్థానంలో డింపుల్ లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.
మెయిన్పురి నియోజకవర్గంతో పాటు రాంపూర్, కతౌలి నియోజకవర్గాల్లోనూ సమాజ్వాదీ పార్టీ లీడ్లో ఉంది. రాంపూర్ నియోజకవర్గంలో ఎస్పీ అభ్యర్థి మహ్మద్ రాజా ఆధిక్యంలో ఉండగా, బీజేపీ అభ్యర్థి ఆకాశ్ సక్సెనా వెనుకంజలో ఉన్నారు. కతౌలిలో ఆర్ఎల్డీ అభ్యర్థి మదన్ భాయియా ముందంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి రాజ్కుమారి సైనిపై 12 వేల ఓట్ల ఆధిక్యంలో మదన్ దూసుకుపోతున్నారు.
403 స్థానాలున్న యూపీ అసెంబ్లీలో బీజేపీ 254 స్థానాల్లో గెలుపొందింది. తన మిత్రపక్షాలను కలుపుకొని బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. సమాజ్వాదీ పార్టీ 110, ఆర్ఎల్డీ 8 స్థానాల్లో గెలుపొందింది. ఇప్పుడు ఈ రెండు స్థానాలను కలిపితే సమాజ్వాదీ పార్టీ బలం 120 స్థానాలకు చేరనుంది.