Site icon vidhaatha

High Court | సీఐసీ, ఐసీల నియామ‌కం ఎప్పుడు?.. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించిన హైకోర్టు

High Court |

హైద‌రాబాద్‌, విధాత: ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ), సమాచార కమిషనర్ల (ఐసీ)ల నియామకం చర్యలు ప్రారంభించారా? లేదా? స్పష్టమైన సమాచారం ఇవ్వాలని రాష్ట్ర ‍ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణ రోజున అడ్వొకేట్‌ జనరల్‌ లేదా అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దాఖలు చేసిన అఫిడవిట్‌ అస్పష్టంగా ఉందని మండిప‌డింది. సీఐసీ, ఐసీ నియామక ఫైల్ అత్యున్నత వర్గాల పరిశీలనలో ఉంది అనడం అసమగ్రంగా ఉందని అభిప్రాయపడింది. కొన్ని నెలలుగా సీఐసీ, ఐసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ప్రభుత్వం నియామకం చేపట్టడం లేదని పేర్కొంటూ హైకోర్టులో ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేసింది.

ప్రజల దరఖాస్తులు పెద్ద ఎత్తున పేరుకుపోతున్నాయని, సమస్యలు పరిష్కారం కాకపోవ‌డం వ‌ల్ల‌ వారు చాలా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. దీనిపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ తుకారాంజీ ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది.

సమాచార కమిషన్‌లో పనిచేస్తున్న ఇతర సిబ్బంది సమస్యల పరిష్కారంలో పాల్గొంటున్నారని ప్రభుత్వం త‌రుపు న్యాయవాది తెలిపారు. అసలు ముఖ్యమైన ప్రధాన సమాచార కమిషనర్‌, సమాచార కమిషనర్లే లేనప్పుడు వ్యాజ్యాలపై ఎవరు ఉత్తర్వులు జారీ చేస్తున్నారని సీజే ప్రశ్నించారు. ప్రభుత్వం వారిని ఎప్పుడు నియమిస్తుందో చెప్పాలని పేర్కొంది. తదుపరి విచారణను జూలై 5కు వాయిదా వేశారు.

Exit mobile version