Janhvi Kapoor | పునర్విక చికిత్సకు రూ.6 కోట్లు హామీ.. మంత్రి నారా లోకేశ్‌పై జాన్వీ కపూర్ ప్రశంసలు

Janhvi Kapoor | ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ తీసుకున్న మానవతా నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్విక ప్రాణాలను కాపాడేందుకు మిగిలిన రూ.6 కోట్లు సమకూర్చే బాధ్యత తనదేనని హామీ ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఆయనపై అభినందనల వర్షం కురుస్తోంది.

Janhvi Kapoor | ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ తీసుకున్న మానవతా నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్విక ప్రాణాలను కాపాడేందుకు మిగిలిన రూ.6 కోట్లు సమకూర్చే బాధ్యత తనదేనని హామీ ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఆయనపై అభినందనల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ క‌పూర్ కూడా స్పందిస్తూ మంత్రి లోకేశ్‌ను ప్రశంసించడం హాట్ టాపిక్‌గా మారింది.

కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్విక ‘SMA టైప్-1’ (Spinal Muscular Atrophy Type-1) అనే అత్యంత ప్రమాదకరమైన అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి సోకిన వారిలో కండరాలు క్రమంగా బలహీనపడతాయి. చివరికి శ్వాస తీసుకోవడమే కష్టంగా మారుతుంది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం పాప ప్రాణాలను కాపాడాలంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ‘జోల్గెన్స్మా’ (Zolgensma) ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ ఒక్క ఇంజెక్షన్ ధర అక్షరాలా రూ.16 కోట్లు. అంత భారీ మొత్తాన్ని భరించే స్థోమత లేకపోవడంతో పునర్విక తల్లిదండ్రులు ప్రజలను ఆర్థిక సాయం కోసం వేడుకున్నారు.

విరాళాలతో రూ.10 కోట్లు.. మిగిలిన రూ.6 కోట్లకు లోకేశ్ హామీ

పాప పరిస్థితి తెలిసిన వెంటనే పలువురు దాతలు ముందుకు వచ్చారు. విరాళాల ద్వారా ఇప్పటికే రూ.10 కోట్లు సమకూరాయి. కానీ చికిత్స పూర్తిచేయడానికి మరో రూ.6 కోట్లు అవసరమయ్యాయి. ఇదే సమయంలో మంత్రి నారా లోకేశ్ స్పందించారు.

సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, పునర్విక చికిత్స కోసం అవసరమైన మిగిలిన రూ.6 కోట్లు సమకూర్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ పాప పోరాడుతున్న ధైర్యాన్ని అభినందిస్తూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

జాన్వీ కపూర్ ప్రశంసలు

మంత్రి లోకేశ్ చేసిన ఈ ట్వీట్‌కు బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ రిప్లై ఇస్తూ, “మానవత్వం ఇంకా బతికే ఉంది.. ఇది నిజంగా ప్రశంసనీయమైన కార్యం” అంటూ ప్రశంసించింది. ఆమె స్పందనతో ఈ విషయం మరింతగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. జాన్వీ చేసిన ట్వీట్‌కు కూడా వేలాది లైకులు, షేర్లు వస్తున్నాయి. నెటిజన్స్ సైతం మంత్రి లోకేశ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.

ప్రశంసల వర్షం

పునర్విక కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి నారా లోకేశ్‌పై రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, సామాన్య ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు. క్లిష్ట సమయంలో చూపిన మానవత్వం పట్ల సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. మొత్తానికి, చిన్నారి పునర్విక ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వంతో పాటు సమాజం కూడా ముందుకు రావడం ‘మానవత్వం ఇంకా బతికే ఉంది’ అన్న మాటను మరోసారి నిజం చేసింది.

Latest News