Jgapathi Babu | రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేస్తున్నప్పటికీ, చిత్రంలోని హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రపై మాత్రం సోషల్ మీడియాలో తీవ్ర చర్చ కొనసాగుతోంది. జాన్వీ పాత్రను తీర్చిదిద్దిన విధానంపై ప్రేక్షకులు, నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండగా, ఈ వివాదం రోజురోజుకూ మరింత ముదురుతోంది.

సినిమాలో జాన్వీ కపూర్ పాత్రకు సరైన ప్రాధాన్యత లేదని, ఆమెను కేవలం గ్లామర్ కోసమే ఉపయోగించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో జాన్వీపై ట్రోలింగ్ కూడా పెరిగిపోయింది. ఈ విమర్శలు ఆమెను మానసికంగా బాధించాయని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ అంశంపై దర్శకుడు బుచ్చిబాబు సానా స్పందించి, కొన్ని విషయాలపై విచారం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.

జాన్వీకి మ‌ద్ద‌తు..

ఇలాంటి సమయంలో ‘పెద్ది’ సినిమాలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు జగపతిబాబు జాన్వీ కపూర్‌కు బహిరంగ మద్దతు తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, జాన్వీని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరికాదని స్పష్టం చేశారు.

“జాన్వీ కపూర్‌ను అనవసరంగా విమర్శించవద్దు. ఆమె చేసిన తప్పేమీ లేదు. ఒక నటిగా దర్శకుడు చెప్పిన పాత్రను చేయడం ఆమె బాధ్యత. జాన్వీ కూడా అదే చేసింది. తాను ఇలా చేస్తానని, అలా చేస్తానని స్వయంగా నిర్ణయాలు తీసుకోలేదు. దర్శకుడి విజన్‌ను నమ్మి పాత్రను పోషించింది” అని జగపతిబాబు అన్నారు.

వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శించ‌వ‌ద్దు..

అలాగే, ప్రతి సారి తెరపై కనిపించే ఫలితం ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. “కొన్నిసార్లు మంచి ఉద్దేశంతో చేసిన అంశాలు కూడా మిస్ ఫైర్ అవుతాయి. పాత్రకు సంబంధించిన తనదైన న్యాయం జాన్వీకి ఉండొచ్చు. కానీ అది ప్రేక్షకులకు పూర్తిగా కనెక్ట్ కాలేకపోయి ఉండవచ్చు. అంతమాత్రానికే ఒక ఆర్టిస్టును వ్యక్తిగతంగా విమర్శించడం, మానసికంగా ఇబ్బంది పెట్టడం సరైంది కాదు” అని పేర్కొన్నారు.

సినిమాను సినిమాగానే చూడాలని, పాత్రలు మరియు నటీనటులను వేర్వేరుగా అర్థం చేసుకోవాలని కూడా ఆయన సూచించారు. “ఒక నటుడిని లేదా నటిని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేయకండి. సినిమాపై అభిప్రాయాలు చెప్పడం వేరు, వ్యక్తిగత దాడులు చేయడం వేరు” అని అన్నారు.

ఇక ‘పెద్ది’ సినిమాలో తాను పోషించిన ‘అప్పలసూరి’ పాత్ర గురించి కూడా జగపతిబాబు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో చేసిన అత్యుత్తమ పాత్రల్లో ఇదొకటిగా భావిస్తున్నానని చెప్పారు.

మేక‌ప్ కోసం మూడు గంట‌ల స‌మ‌యం..

“అప్పలసూరి పాత్ర ఎలా ఉంటుందో బుచ్చిబాబు ముందుగానే ఏఐ విజువలైజేషన్ ద్వారా చూపించారు. అప్పుడే ఆ పాత్రపై నాకు ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. ప్రతి రోజు మేకప్ కోసం దాదాపు మూడు గంటల సమయం పట్టేది. ఆ సమయంలో ఏమీ తినకుండా ఉండేవాడిని. అందుకే శారీరకంగా కూడా చాలా మార్పు వచ్చింది” అని వివరించారు.

ఇంటర్వెల్ సమయానికే తన పాత్ర ముగిసిపోయినా, ఆ పాత్ర ప్రభావం సినిమా మొత్తం కనిపించేలా దర్శకుడు డిజైన్ చేశాడని జగపతిబాబు ప్రశంసించారు. “అప్పలసూరి పాత్ర నిడివి కంటే దాని ప్రభావమే ఎక్కువ. ఆ పాత్రను బుచ్చిబాబు చాలా బలంగా తీర్చిదిద్దాడు” అని అన్నారు.

ప్రస్తుతం జగపతిబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకవైపు ‘పెద్ది’ విజయోత్సాహం కొనసాగుతుండగా, మరోవైపు జాన్వీ కపూర్ పాత్రపై జరుగుతున్న చర్చకు ఆయన వ్యాఖ్యలు కొత్త కోణాన్ని తీసుకొచ్చాయి.