Air India Crash | ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదం: బోయింగ్‌ 787లో ముందే భద్రతా లోపాలు

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదానికి ముందు బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్‌లో తీవ్రమైన సాంకేతిక లోపాలు ఉన్నాయని అమెరికా భద్రతా సంస్థ వెల్లడించింది. ఇంజిన్‌, విద్యుత్‌ వ్యవస్థలో అగ్నిప్రమాదాలు సహా అనేక సమస్యలు నమోదయ్యాయని పేర్కొంది.

Air India crash wreckage on building in Ahmedabad – భవనంపై పడిన విమాన భాగాలు

Air India Crash: Safety Defects in Boeing 787 Raised Before Ahmedabad Tragedy, Say US Campaigners

సారాంశం:

అహ్మదాబాద్‌లో కూలిన ఎయిర్‌ ఇండియా బోయింగ్‌ 787 విమానంలో గతంలోనే తీవ్రమైన సాంకేతిక లోపాలు ఉన్నాయని అమెరికా భద్రతా సంస్థ వెల్లడించింది. పవర్‌ సిస్టమ్‌లో అగ్నిప్రమాదాలు, వైరింగ్ లోపాలు నమోదయ్యాయని తెలిపింది. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

 

విధాత భారత్​ డెస్క్​ | హైదరాబాద్​:

Air India Crash | గత ఏడాది అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్‌ ఇండియా బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్‌ విమానం వైద్య కళాశాల హాస్టల్​పై కుప్పకూలి 260 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదానికి గురైన విమానంలో అంతకుముందే అనేక భద్రతా లోపాలు ఉన్నాయని అమెరికాకు చెందిన ‘ఫౌండేషన్‌ ఫర్‌ ఏవియేషన్‌ సేఫ్టీ’ (FAS) సంస్థ ఆరోపించింది. ఈ మేరకు అమెరికా సెనెట్‌కు నివేదిక పంపినట్లు వెల్లడించింది. తమకు లభించిన అంతర్గత పత్రాల ఆధారంగా ఈ నివేదిక సిద్ధం చేసినట్లు తెలిపింది.

FAS (Foundation for Aviation Safety) అనేది అమెరికాకు చెందిన విమాన భద్రతా సంస్థ. విమానాల తయారీ, నిర్వహణ, ఆపరేషన్‌లో ఉండే లోపాలను గుర్తించి, వాటిపై నివేదికలు విడుదల చేయడం దీని ప్రధాన లక్ష్యం. ప్రయాణికుల భద్రతకు భంగం కలిగించే అంశాలను ప్రభుత్వం, నియంత్రణ సంస్థల దృష్టికి తీసుకెళ్లడం కోసం ఈ సంస్థ పనిచేస్తుంది. బోయింగ్ మాజీ అధికారి ఎడ్‌ పియర్సన్ నేతృత్వంలో ఈ సంస్థ కొనసాగుతోంది.

ప్రమాదానికి గురైన విమానం (VT-ANB) 2013లో తయారై, 2014నుండి ఎయిర్‌ ఇండియాలో సేవలందిస్తోంది. మొదటి రోజునుంచే ఈ విమానంలో విద్యుత్‌, సాఫ్ట్‌వేర్‌, వైరింగ్​, సర్క్యూట్‌ బ్రేకర్లు, షార్ట్‌ సర్క్యూట్‌, పవర్‌ సిస్టమ్‌ ఓవర్‌హీట్‌ వంటి సమస్యలు ఎదురైనట్లు నివేదికలో పేర్కొంది.

 2022లోనే పవర్‌ ప్యానెల్‌లో అగ్నిప్రమాదం.. పైలట్‌లపై నిందలు?

2022 జనవరిలో ఫ్రాంక్‌ఫర్ట్‌ విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతున్న సమయంలో విమానంలోని P100 పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్యానెల్‌లో అగ్నిప్రమాదం జరిగినట్లు FAS వెల్లడించింది. నష్టం తీవ్రంగా ఉండటంతో మొత్తం ప్యానెల్‌ మార్చాల్సి వచ్చిందని తెలిపింది.

బోయింగ్‌ 787 విమానాలు ఇతర విమానాల కంటే ఎక్కువగా విద్యుత్‌ వ్యవస్థలపై ఆధారపడి ఉంటాయి. దీంతో ప్రారంభ దశలోనే బ్యాటరీ అగ్నిప్రమాదాలు, పవర్‌ ఫెయిల్యూర్లు నమోదయ్యాయి.

ఇక ప్రమాదంపై భారతీయ విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ (AAIB) గత ఏడాది జూలైలో ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. టేకాఫ్‌ అనంతరం ఇంధన నియంత్రణ స్విచ్‌లు ‘రన్’ నుంచి ‘కట్-ఆఫ్‌’ స్థితికి మారినట్లు నివేదికలో పేర్కొంది. దీంతో ఇంజిన్‌లకు ఇంధన సరఫరా ఆగి, వేగంగా శక్తి కోల్పోయినట్లు తెలిపింది.

కాక్‌పిట్‌ రికార్డింగ్‌లో ఒక పైలట్‌ “నువ్వెందుకు కట్‌ ఆఫ్‌ చేశావు?” అని అడగగా, మరో పైలట్‌ “నేను చేయలేదు” అని సమాధానమిచ్చినట్లు నివేదిక పేర్కొంది. దీనితో పైలట్‌లపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే న్యాయవాదులు, పైలట్‌ సంఘాలు, భద్రతా నిపుణులు దీనిని వ్యతిరేకిస్తున్నారు. అసలు సమస్య విమానంలోనే  ఉందని, పైలట్‌లపై నిందలు మోపడం తప్పుదారి పట్టించడమేనని వారు వాదిస్తున్నారు.

బోయింగ్‌పై పెరుగుతున్న ఒత్తిడి

ఈ నివేదికను బోయింగ్‌ సంస్థ మాజీ మేనేజర్‌ ఎడ్‌ పియర్సన్‌ నేతృత్వంలోని FAS రూపొందించింది. బోయింగ్‌ భద్రతా ప్రమాణాలపై ఆయన ఎప్పటి నుంచో విమర్శలు చేస్తూ వస్తున్నారు. అమెరికా సెనెట్‌ కూడా గతంలో ‘బోయింగ్‌ భద్రతా సంస్కృతి వైఫల్యం’పై విచారణలు జరిపింది. తాజాగా వెలుగులోకి వచ్చిన నివేదికతో సంస్థపై ఒత్తిడి మరింత పెరిగింది.

ఇప్పటివరకు బోయింగ్‌ మాత్రం 787 విమానం సురక్షితమేనని, పదిహేనేళ్లలో ఒక్క ప్రమాదం కూడా జరగలేదని స్పష్టం చేస్తోంది. అహ్మదాబాద్‌ ఘటనపై విచారణ కొనసాగుతున్నందున స్పందించలేమని తెలిపింది.

Latest News