Lok Sabha Results | లక్నో : ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రామ జపం ఏ మాత్రం వర్కవుట్ కాలేదని లోక్సభ ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికలకు ముందు అయోధ్య రామాలయం ప్రారంభించినప్పటికీ, బీజేపీకి ప్రతికూల పరిస్థితులే ఎదురయ్యాయని చెప్పొచ్చు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. చివరకు అయోధ్యలోనూ బీజేపీ ఓటమి దిశగా పయనిస్తోంది.
80 లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో ఎన్డీఏ కూటమి కేవలం 37 స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉంది. ఇండియా కూటమి 42 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీకి సమాజ్వాదీ పార్టీ గట్టి పోటీనిస్తుంది. సమాజ్వాదీ పార్టీ 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లో లీడ్లో ఉంది. బీజేపీ 35 స్థానాల్లో, దాని మిత్రపక్షం ఆర్ఎల్డీ రెండు స్థానాల్లో ముందంజలో ఉంది. ఆజాద్ సమాజ్ పార్టీ ఒక స్థానంలో లీడింగ్లో ఉంది.
వారణాసిలో నరేంద్ర మోదీ అతి తక్కువ మెజార్టీతో ముందంజలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ మోదీకి గట్టి పోటీనిస్తున్నారు. లక్నోలో రాజ్నాథ్ సింగ్ లీడ్లో ఉన్నారు. సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్ కన్నౌజ్, మెయిన్పురిలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రాహుల్ గాంధీ రాయ్బరేలీలో ముందంజలో ఉన్నారు. అమేథిలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీకి కాంగ్రెస్ అభ్యర్థి కిశోరి లాల్ శర్మ గట్టి పోటీనిస్తున్నారు. స్మృతి ఇరానీ వెనుకంజలో ఉన్నారు. అయోధ్య జిల్లాలోని ఫైజాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్ వెనుకంజలో ఉన్నారు. సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి అవదేశ్ ప్రసాద్ 5,326 ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.