విధాత, హైదరాబాద్ : ఒడిస్సాలోని పూరీ జగన్నాథుడి రథయాత్ర ఆదివారం తెల్లవారుజామున వైభవంగా ప్రారంభమైంది. రాష్ట్రంతో పాటు దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చిన భక్తులతో పూరీ కిక్కిరిసిపోయింది. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరీ నగర వీధుల్లో ఊరేంచారు. జై జగన్నాథ్, హరిబోల్ నామస్మరణతో అక్కడి వీధులన్నీ మార్మోగాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా రెండు రోజుల పాటు జరిగే జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం పూరి జగన్నాథ్ను దర్శించారు. రాష్ట్రపతికి ఒడిషా సీఎం మోహన్ చరణ్ మాఝీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఒడిషా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ కూడా పాల్గొన్నారు. జగన్నాథుడి రథయాత్రకు దేశవ్యాప్తంగా లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. జగన్నాధుడిని దర్శించుకుని రథయాత్రలో పాలుపంచుకున్నారు. కాగా, ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పూరి జగన్నాథ రథయాత్ర 1971 నుంచి జరుగుతుంది. ఈ రథయాత్రను ఈసారి అత్యంత వైభవంగా రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు.మోహన్ చరణ్ మాఝీ నేతృత్వంలోని ఒడిషా ప్రభుత్వం జగన్నాధ రథయాత్రకు విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈ యాత్ర పూరీ నుండి గుండిచా దేవాలయం వరకు సాగుతుంది. ప్రతి యేటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ రథం దాదాపు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి. దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు.
రథయాత్ర సందర్భంగా ఆదివారం తెల్లవారుజాము 4 గంటలకు రత్నసింహాసనంపై చతుర్ధామూర్తులు కొలువు దీరారు. అనంతరం జగన్నాథుని నవయవ్వన రూపాలంకరణ నిర్వహించారు. మంగళహారతి, మైలం, అబకాశ, తిలకధారణ, గోపాలవల్లభ సేవల తర్వాత 10 గంటలకు నేత్రోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటలకు పూరీ రాజు గజపతి దివ్యసింగ్ధేవ్ రథాలపై చెరాపహరా (చీపురుతో రథాల ముందు ఊడ్చడం) చేశారు. సాయంత్రం 4 గంటలకు రథాలకు సారథులు, అశ్వాలు అమర్చి తాళ్లు కట్టారు. 5 గంటలకు తొలుత బలభద్రుని తాళధ్వజ రథం లాగగా, తర్వాత దేవీ సుభద్ర దర్పదళస్, చివరిగా పురుషోత్తముని నందిఘోష్ రథం తల్లి సన్నిధికి బయలుదేరింది. పుర వీధులపై దివ్య రథంపై జగన్నాథుడిని దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు.
వైభవంగా పూరీ జగన్నాథ రథ యాత్ర … హాజరైన రాష్ట్రపతి ద్రౌపతి ముర్మూ
