Lok Sabha Elections 2024 : దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ మొదలైంది. మొత్తం 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 లోక్సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఓటర్లు పోలింగ్ ప్రారంభానికి ముందు నుంచే క్యూలైన్లలో బారులు తీరారు.
దేశవ్యాప్తంగా ఇవాళ పోలింగ్ జరుగుతున్న లోక్సభ స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 25 స్థానాలు, తెలంగాణ నుంచి మొత్తం 17 స్థానాలు, ఉత్తరప్రదేశ్ నుంచి 13 స్థానాలు, మహారాష్ట్ర నుంచి 11 స్థానాలు, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ నుంచి ఎనిమిదేసి స్థానాలు, బీహార్ నుంచి నాలుగు స్థానాలు, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల నుంచి నాలుగేసి స్థానాలు, జమ్ముకశ్మీర్లో ఒక స్థానానికి పోలింగ్ జరుగుతోంది.
ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం ఈ 96 లోక్సభ స్థానాల్లో 4,264 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ విడతలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్రంజన్ చౌధరి, టీఎంసీ నాయకురాలు మహువా మొయిత్రా, బీజేపీ నేత గిరిరాజ్ సింగ్, జేడీయూ నేత లలన్సింగ్, టీఎంసీ నేతలు శతృఘ్ను సిన్హా, యూసఫ్ పఠాన్, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ శర్మిల తదితర ప్రముఖులు అభ్యర్థులుగా ఉన్నారు.
కాగా, ఇప్పటికే మూడు విడతల్లో 283 లోక్సభ స్థానాలకు పోలింగ్ ముగిసింది. నాలుగో విడతలో 96 స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. మిగిలిన స్థానాలకు మరో మూడు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఐదో విడత పోలింగ్ మే 20న, ఆరో విడత పోలింగ్ మే 25న చివరిదైన ఏడో విడత పోలింగ్ జూన్ 1న నిర్వహించనున్నారు. జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.